సోనూ సూద్ సేవ వెనుక వాళ్లిద్దరూ..

మన దేశంలో ఎంతోమంది ప్రముఖులు సేవా కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. కానీ వాళ్లలో సోనూ సూద్ చాలా ప్రత్యేకం. ఒక పరిమితి అని పెట్టుకోకుండా.. ఇక చాలు అనుకోకుండా అతను లాక్ డౌన్ టైం నుంచి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుండటం.. భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించేలా భారీ ప్రణాళికలతో వెళ్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

కొందరు అతడి సేవా కార్యక్రమాలపై సందేహాలు వ్యక్తం చేసినా, దురుద్దేశాలు ఆపాదించినా అతను వెనకడుగు వేయట్లేదు. ఇంతగా అతను స్పందించడానికి ఏం పురిగొల్పిందన్నది జనాలకు అర్థం కావడం లేదు. ఆ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు సోనూ సూద్. తన తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారమే తాను ఈ రోజు ఇంతమందికి సాయ పడుతున్నట్లు సోనూ వెల్లడించాడు.

2008లో తన తల్లిని, 2016లో తన తండ్రిని కోల్పోయినట్లు సోనూ వివరిస్తూ ఎమోషనల్ అయ్యాడు ఓ ఇంటర్వ్యూలో. తమ కుటుంబ స్వస్థలం పంజాబ్‌లోని మోగా అని వెల్లడించిన సోనూ.. తన తల్లిదండ్రులు బతికుండగా ‘ఏదో ఒక రోజు మీ బిడ్డ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకునేలా చేస్తా’ అని మాట ఇచ్చానని.. వాళ్లు ఆ రోజు ఇచ్చిన ఆశీర్వాద ఫలితంగానే తాను అంతా చేయగలిగానని, ఈ రోజు ఇంతమంది ప్రేమాభిమానాలు పొందుతున్నానని సోనూ తెలిపాడు.

కేంద్ర ఎన్నికల సంఘం.. సోనూను ఇటీవల పంజాబ్ ఎన్నికల ఐకాన్‌గా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ ఈ విషయాలు మాట్లాడాడు. తనుకు ఇచ్చిన గుర్తింపు పెద్ద బాధ్యత అని.. ఇప్పుడు తన తల్లిదండ్రులు తనను చూసి ఎంతో సంతోషిస్తుంటారని భావోద్వేగానికి గురయ్యాడు సోనూ. ప్రజల ప్రేమ, నమ్మకాన్ని మోసేంత శక్తి తనకు ఎక్కడి నుంచి వస్తోందో తెలియడం లేదని.. తనలో బలం, ధైర్యం ఉన్నంత కాలం ఎలాంటి బాధ్యతనైనా మోస్తానని సోనూ వ్యాఖ్యానించాడు.