విక్రమ్ వారసుడి తప్పటడుగులు

చియాన్ విక్రమ్ కు తమిళ, తెలుగులో పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అందుకే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా తన సినిమా వస్తోందంటే ఏపీ తెలంగాణలో కనీస ఓపెనింగ్స్ ఉంటాయి. ఇక కోలీవుడ్ సంగతి సరేసరి. యావరేజ్ ఉన్నా సరే హిట్టు చేసి పెడతారు. ఇంత ఫాలోయింగ్ ఉన్న విక్రమ్ తన కొడుకు ధృవ్ విషయంలో సరైన ప్లానింగ్ ఇవ్వడం లేదనే కామెంట్స్ ఫ్యాన్స్ మధ్యలో వస్తున్నాయి. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో తెరకు పరిచయమైన ధృవ్ విక్రమ్ డెబ్యూ చేసింది 2020లో. ఆ తర్వాత నాన్న విక్రమ్ తో కలిసి మహాన్ చేశాడు కానీ అది ఓటిటిలో రావడం వల్ల కమర్షియల్ స్టామినా తెలియలేదు.

ఇప్పుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ చేస్తున్నాడు. ఇది ప్యాన్ ఇండియా మూవీనే కానీ చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేయలేదు. ఒకపక్క కార్తీ, సూర్య లాంటి సీనియర్ హీరోలు వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ ఉంటే ధృవ్ మాత్రం ఇలా రెండేళ్లకొకటి చేయడం వల్ల కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడో అర్థం కావడం లేదు. పైగా థగ్ లైఫ్ తో అల్ట్రా డిజాస్టర్ అందుకున్న మణిరత్నంకి ఎస్ చెప్పాడనే టాక్ మరింత ఖంగారు పెట్టేలా ఉంది. ఎందుకంటే శింబు వద్దనుకున్న సబ్జెక్టుని ఇప్పుడు ధృవ్ ఓకే చేశాడనే ప్రచారం చెన్నై వర్గాల్లో ఉంది.

పొన్నియిన్ సెల్వన్ తో డీసెంట్ హిట్ అందుకున్న మణిరత్నం బయట రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఇక థగ్ లైఫ్ సంగతి సరేసరి. ఇలా మేజిక్ టచ్ కోల్పోయిన సీనియర్ డైరెక్టర్ తో చేయడం వల్ల ధృవ్ కి అది ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ లో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి వసంత్ ఇప్పుడీ మూవీలో ధృవ్ జోడిగా ఎంపికైనట్టు తెలిసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మాములే. అయినా కుర్రాళ్ళు ఉడుకు రక్తంతో పరుగులు పెట్టాలి కానీ మీనమేషాలు లెక్కబెట్టుకుంటూ నెమ్మదిగా సినిమాలు చేయడం ఎంత మాత్రం మంచిది కాదు.