చెప్పు తెగుద్ది – అనసూయ వార్నింగ్

యాంకర్, నటి అనసూయకు పబ్లిక్ స్టేజి మీద కోపం వచ్చింది. గట్టి పదజాలంతో అభిమానులకు వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా అనసూయ వెళ్ళింది. ప్రారంభోత్సవం అయ్యాక బయట స్టేజి మీద ఫ్యాన్స్ ని ఉద్దేశించి సెలబ్రిటీలు మాట్లాడ్డం సహజం. అందులో భాగంగా ముచ్చటిస్తున్న అనసూయ ప్రసంగానికి కొందరు అడ్డు తగిలారు. అసభ్య కామెంట్లతో ఆమెకు వినిపించేలా అరవడంతో అనసూయకు ఆగ్రహం తెప్పించింది. మైకులోనే అందరికీ వినిపించేలా చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఇంట్లో మీ అమ్మా నాన్న, కుటుంబ సభ్యులు మర్యాద ఇవ్వడం నేర్పించలేదా, వాళ్ళను ఎవరైనా మీలా కామెంట్ చేస్తే ఊరుకుంటారా అంటూ చిన్న సైజు క్లాస్ తీసేసుకుంది. అయితే వాళ్ళు ఏమన్నారో వీడియోలో సరిగా వినిపించలేదు కానీ అంతగా కోపం కలిగిందంటే ఏదో పెద్ద పదమే అయ్యుంటుంది. నిజానికి అలాంటి సమూహాల్లో సంస్కారం లేని వాళ్ళు ఉంటారు. అది సహజం. కావాలని అల్లరి చేసేందుకు లేదా నలుగురి దృష్టిలో పడాలని తప్పు చేసేవాళ్ళు వస్తారు. అనసూయ విషయంలోనూ ఇదే జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయకు ఇలా ఓపెన్ గ్రౌండ్ లో ఫైరవ్వాల్సి రావడం ఇదే మొదటిసారి.

సరే తప్పొప్పులను పక్కనపెడితే స్టార్లు బయటికి వెళ్ళినప్పుడు సంయమనం అయితే ఉండాల్సిందే. ఎందుకంటే అక్కడ పబ్లిక్ చేసిన కామెంట్స్ కంటే చెప్పు తెగుద్ది అంటూ అనసూయ ఇచ్చిన వార్నింగే ఎక్కువ దూరం వెళ్తుంది. సభ్యత సంస్కారం చెబితే నేర్చుకునే కుర్రకారు తక్కువ. అలాంటప్పుడు చెప్పే ప్రయత్నం చేయడం కూడా వృథానే. ఏదైతేనేం అనసూయ మరోసారి ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో టాపిక్ అవుతోంది. ఇటీవలే తన సోషల్ మీడియా అకౌంట్లలో కొన్ని లక్షల మందిని బ్లాక్ చేశానని చెప్పిన రెండు రోజులకే ఈ చెప్పు తెగుద్ది ఘటన జరగడం గమనార్షం. దీనికి వివరణగా ఏదైనా వీడియో రిలీజ్ చేస్తారేమో చూడాలి.