జబర్దస్త్ యాంకర్తో ప్రయాణం మొదలుపెట్టి.. టాలీవుడ్లో బిజీ ఆర్టిస్టుల్లో ఒకరిగా ఎదిగింది అనసూయ భరద్వాజ్. ‘రంగస్థలం’ సినిమాతో నటిగా ఆమె కెరీర్ గొప్ప మలుపే తిరిగింది. ఇప్పటిదాకా 50 సినిమాలకు పైగానే నటించిందామె. ఐతే జబర్దస్త్తో అవకాశం అందుకోవడానికి ముందు తనేంటి అన్నది జనాలకు పెద్దగా ఐడియా లేదు. అంతకుముందే ఆమెకు సినిమాలతో సంబంధం ఉందట. సుకుమార్, త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుల కళ్లలో ఆమె పడిందట. కానీ అది నటిగా మాత్రం కాదట. ఒక వీఎఫెక్స్ కంపెనీలో హెచ్ఆర్గా పని చేస్తూ తాను ఈ అగ్ర దర్శకుల దృష్టిలో పడ్డట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
పెళ్లి కాక ముందు తాను ఒక హైదరాబాద్ బేస్డ్ టాప్ వీఎఫెక్స్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పని చేసినట్లు అనసూయ తెలిపింది. ఆ సంస్థ హాలీవుడ్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులకు కంటెంట్ అందించినట్లు ఆమె చెప్పింది. ‘కంత్రి’ సినిమాలో చిన్న ఎన్టీఆర్ బొమ్మ కనిపించే వీఎఫెక్స్ కంటెంట్ చేసింది తమ కంపెనీనే అని.. ఆ టైంలో ఆ చిత్ర దర్వకుడు మెహర్ రమేష్ తమ కంపెనీకి వచ్చేవాడని.. ఆయనే కాక సుకుమార్, త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకులు కూడా తమ ఆఫీసుకు వస్తూ పోతూ ఉండేవారని.. తాను హెచ్ఆర్గా వాళ్ల దృష్టిలో పడ్డానని అనసూయ వెల్లడించింది.
తమ సంస్థ లైఫ్ ఆఫ్ పై సహా అనేక ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రాలకు కంటెంట్ ఇచ్చిందని.. ఒక ఇండియన్ కంపెనీ ఇంత పెద్ద హాలీవుడ్ సినిమాలకు పని చేయడం చిన్న విషయం కాదని.. అందుకు తామెంతో గర్వించేవాళ్లమని అనసూయ తెలిపింది. వీఎఫెక్స్ కంపెనీలో ఏ పని అయినా గొడ్డు చాకిరీ అన్నట్లే ఉంటుందని.. ఒక ప్రాజెక్టు తీసుకున్నాక అది పూర్తయ్యే వరకు ఒక టైం అంటూ లేకుండా పని చేయాల్సి ఉంటుందని.. ఇది చాలా కష్టంతో కూడుకున్న వర్క్ అని అనసూయ చెప్పింది. తన భర్త భరద్వాజ్ను తాను ఇక్కడే కలిశానని.. తాము ప్రేమలో పడ్డానని.. తన లైఫ్లో ఒకరే బాయ్ ఫ్రెండ్ అని.. ఆ బాయ్ఫ్రెండ్నే తాను పెళ్లి చేసుకున్నానని అనసూయ సిగ్గుపడుతూ చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates