పవన్ కళ్యాణ్ నోట ఫ్లాపుల మాట

హైదరాబాద్ లో జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. సమయపాలన పరంగా కొంచెం ఆలస్యం జరిగినప్పటికీ ఎలాంటి అవాంతరాలు, ఇబ్బంది లేకుండా పక్కా ప్లానింగ్ తో నిర్వహించడం హమ్మయ్యా అనుకునేలా చేసింది. పరిమితికి మించి అభిమానులు వచ్చినప్పటికీ పాసుల విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్ల సెక్యూరిటీ సమస్యలు రాలేదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన మంత్రులు, బ్రహ్మానందం లాంటి ఇండస్ట్రీ ప్రముఖులు తప్ప ప్రత్యేకంగా వేరే సెలబ్రిటీలు రాలేదు. ఫ్యాన్స్ కోరుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, బండ్ల గణేష్ ఇద్దరూ లేకపోవడం లోటే.

ఇక పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో మాట్లాడుతూ ఫ్లాపుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఎక్కువ ఫ్లాపులు వచ్చి ఒకదశలో డౌన్ ఫీలవుతున్న టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి గొప్ప స్నేహితుడు వచ్చాడని, జల్సా రూపంలో తనకు హిట్ ఇవ్వడమే కాక ఒక గొప్ప బంధానికి తోడుగా నిలిచాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సినిమా మీకు నచ్చిందా బద్దలు కొట్టేయండి అంటూ హరిహర వీరమల్లు ఏ స్థాయిలో ఉంటుందో చెప్పకనే చెప్పారు. భీమ్లా నాయక్ టైంలో పది పదిహేను రూపాయల టికెట్లకు కూడా మంచి వసూళ్లు తెచ్చామని, ఇప్పుడు మన ప్రభుత్వంలో ఎవడ్రా మనల్ని ఆపేది అంటూ వచ్చిన ఫ్యాన్స్ అందరికీ జోష్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

మాట్లాడుతున్నంత సేపూ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా కాక ఒకప్పటి పవర్ స్టార్ లా ఫ్యాన్స్ కి కనిపించడం ఈవెంట్ లో మెయిన్ హైలైట్. ఉదయం ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడటం బాగుంది. అందరికీ థాంక్స్ చెప్పే ఉద్దేశంతో కాగితం మీద రాసుకొచ్చిన పవన్ కళ్యాణ్ తాను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ పూర్తి చేశాకే స్టేజి దిగడం విశేషం. హరిహర వీరమల్లులకు సంబంధించిన విశేషాలు పంచుకున్న పవన్ కళ్యాణ్  విశాఖపట్నంతో పాటు మరో రెండు మూడు చోట్ల మిమ్మల్ని కలుసుకుంటానంటూ చెప్పడం చూస్తే రాబోయే రోజుల్లో మరిన్ని కబుర్లు తెలియనున్నాయి.