నైజామ్ రేట్లు… వీరమల్లుకు వరాల జల్లు

ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ముందు రోజు ప్రీమియర్లకు పర్మిషన్లు, జిఓలు వచ్చిన తర్వాత తెలంగాణలో ఇస్తారా లేదానే టెన్షన్ అభిమానులను వెంటాడింది. పుష్ప 2 సమయంలో సంధ్య థియేటర్ దుర్ఘటన ఇంకా మర్చిపోలేని నేపథ్యంలో అనుమతుల గురించి అనుమానాలు బలంగా ఉండేవి. ఆ టైంలో సినిమాటోగ్రఫీ మంత్రి ఇకపై స్పెషల్ షోలు ఉండవనే రీతిలో సంకేతాలు ఇవ్వడం సినీ ప్రియులు గుర్తు చేసుకున్నారు. అయితే వాటిని పటాపంచలు చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి సర్కారు ధారాళంగా వరాలు కురిపించేసింది. కొద్దీ నిమిషాల క్రితమే జిఓ వచ్చింది. కొంచెం దగ్గరగా ఏపినే ఫాలో అయ్యారు.

జూలై 23 రాత్రి 9 తర్వాత వేసే బెనిఫిట్ షోల టికెట్ ధర ఫ్లాట్ 600 రూపాయలు ప్లస్ జిఎస్టిగా నిర్ణయించారు. జూలై 24 నుంచి 27 దాకా నాలుగు రోజుల పాటు రోజు 5 షోలు వేసుకోవచ్చు. మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ మీద 200 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 150 చొప్పున పెంచుకోవచ్చు. జూలై 28 నుంచి ఆగస్ట్ 2 వరకు మల్టీప్లెక్సుల్లో 150, సింగల్ స్క్రీన్లలో 106 రూపాయల దాకా ఒక్కో టికెట్ మీద అదనంగా ఛార్జ్ చేయొచ్చు. రిలీజ్ రోజు నుంచి ఉన్న ధరలు జిఎస్టి కలిపే ఉంటాయి. ఆగస్ట్ 3 నుంచి రెగ్యులర్ రేట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరమల్లుకి సూపర్ సపోర్ట్ దక్కేసింది.

ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చేసింది కాబట్టి ఇక నెక్స్ట్ మిగిలింది జూలై 23 అర్ధరాత్రి ఎలాంటి టాక్ రాబోతుందనేది. ఇంత రేట్లు పెట్టినప్పుడు కంటెంట్ కి న్యాయం జరిగితేనే నెగటివ్ టాక్ బయటికి రాదు. ఈ విషయంలో పుష్ప 2 విజయం సాధిస్తే గేమ్ ఛేంజర్ దెబ్బ తింది. నిర్మాత ఏఎం రత్నం టికెట్ కు ఎంత పెట్టినా బెస్ట్ విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తామని హామీ ఇస్తున్నారు. గత రెండు మూడు వారాలుగా సరైన సినిమా లేక థియేటర్లకు దూరంగా ఉన్న కామన్ ఆడియన్స్ ఇంత రేట్ పెట్టి వీరమల్లు చూస్తారా అనేది వేచి చూడాలి. కఠినంగా ఉంటుందనుకున్న తెలంగాణ గవర్నమెంట్ ఇంత సానుకూలంగా ఉండటం రాబోయే ప్యాన్ ఇండియా మూవీస్ కి గుడ్ న్యూసే.