ఊహించని విధంగా తన కొత్త సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడం నిన్న సాయంత్రం నుంచే జనాలను ఆశ్చర్యపరిచింది. ఎన్నడూ లేనిది ఇంత చొరవ తీసుకోవడం పట్ల ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఇవాళ పార్క్ హయత్ లో జరిగిన సమావేశంలో అనుకున్న దానికన్నా ఎక్కువ సేపు పవన్ మాట్లాడారు. చాలా గ్యాప్ తర్వాత ఏపీ డిప్యూటీ సిఎంలాగా కాకుండా ఒక టాలీవుడ్ స్టార్ లా తను కనిపించడం చూసి అభిమానులు మురిసిపోయారు. సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పటికీ అప్పటిదాకా ఎదురు చూడనివ్వకుండా పవన్ చాలా విశేషాలు పంచుకున్నారు.
ముఖ్యంగా నిర్మాత ఏఎం రత్నం కోసమే ఈ ప్రెస్ మీట్ అడిగి పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ చాలాసేపు ఆయన్ని పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. అజ్ఞాతవాసిలో త్రివిక్రమ్ రాసినట్టు ఒక కుర్చీ కోసమే పెద్ద యుద్ధాలు జరిగితే ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీకి ఇంకెన్ని చిన్న యుద్దాలు జరిగి ఉంటాయి, రత్నం ఎంతగా నలిగిపోయి ఉంటారో తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఎంత కష్టం వచ్చినా మౌనంగా ఉండే రత్నంకు ఆ లక్షణం రమణ మహర్షిని స్ఫూర్తిగా తీసుకోవడం వల్ల వచ్చిందేమో కానీ ఇలాంటి ప్రొడ్యూసర్లకు అండగా నిలబడాల్సిన బాధ్యత తన మీద ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చానని వివరించారు.
రాబోయే రెండు రోజులు కలుస్తూనే ఉంటానని, ఇంటర్వ్యూలు ఇస్తానని పవన్ ఈ సందర్భంగా చెప్పారు. ఏపీ ప్రభుత్వాన్ని కోరి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని రత్నంకి ఇవ్వమని కోరతానని, ఇండస్ట్రీ బాగు కోరే ఇలాంటి వ్యక్తులు దానికి అర్హులని చెప్పడం విశేషం. రావడం రాకపోవడం అన్నీ తన చేతుల్లో ఉండవనే హింట్ కూడా ఇచ్చారు. గతంలో పవన్ ఇంతగా ఒక నిర్మాతగా ఒన్ చేసుకోవడం చాలా అరుదని చెప్పాలి. అయిదేళ్ల నిర్మాణం, లెక్కలేనన్ని వాయిదాలు, కరోనా బ్రేకులు, దర్శకుడి మార్పు, వందల కోట్ల బడ్జెట్ ఇన్ని భరించిన ఏఎం రత్నం ఈ ప్రశంసలు అందుకోవాల్సిన వ్యక్తే.
Gulte Telugu Telugu Political and Movie News Updates