సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి.. బాషా. సౌత్ ఇండియన్ కమర్షియల్ సినిమాలను గొప్ప మలుపు తిప్పిన చిత్రంగా దాన్ని చెప్పొచ్చు. రజినీ అంతకుముందే స్టార్ కానీ.. ఆయనకు సౌత్ అంతటా తిరుగులేని ఫాలోయింగ్ పెంచి, నిజమైన సూపర్ స్టార్ను చేసిన చిత్రం అదే. తర్వాతి కాలంలో ‘బాషా’ స్ఫూర్తితో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క లేదు. ఈ రోజుల్లో అయితే ఒక సినిమా హిట్టవగానే సీక్వెల్ అంటున్నారు కానీ.. ఆ రోజుల్లో ఆ ట్రెండ్ లేకపోవడంతో ‘బాషా’ సీక్వెల్ గురించి ప్రతిపాదనే రాలేదు. దర్శకుడు సురేష్ కృష్ణ సైతం ఎప్పుడూ అలాంటి ఆలోచన చేయలేదు.
కానీ టాలీవుడ్ యువ దర్శకుడు వశిష్ఠ.. రజినీతో ‘బాషా’ సీక్వెల్ చేయాలనుకున్నాడట. అందుకోసం సీరియస్గా ప్రయత్నాలు జరగడం, ఈ ప్రాజెక్టుకు అంగీకారం కుదరడం కూడా జరిగిందట. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లు అతను తెలిపాడు. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వశిష్ఠ. తర్వాత అతడికి మాంచి డిమాండ్ ఏర్పడింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. వశిష్ఠతో ఓ సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకున్నాడట. ఆయన బేనర్లో సూపర్ స్టార్ రజినీకాంత్తో సినిమా చేయడానికి వశిష్ఠ ప్లాన్ చేశాడట.
రజినీకి కథ కూడా చెప్పి ఒప్పించాడట వశిష్ఠ. అది ‘బాషా’కు సీక్వెల్ లా ఉంటుందని.. రజినీకి కూడా కథ నచ్చిందని.. రాజు బేనర్లో సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందని వశిష్ఠ వెల్లడించాడు. కానీ ఎక్కడో తనకే కథ విషయంలో సంతృప్తికరంగా అనిపించలేదని.. ఏదో లోటు ఉందని అనిపించిందని.. అందుకే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదని వశిష్ఠ తెలిపాడు. రజినీతో వశిష్ఠ సినిమా అంటూ ఆ మధ్య ప్రచారం జరిగిన మాట వాస్తవం. అప్పుడది జస్ట్ రూమరనే అనుకున్నారు. ఇప్పుడు వశిష్ఠ మాటల్ని బట్టి చూస్తే సీరియస్గానే ఈ కాంబోలో సినిమాకు ప్రయత్నాలు జరిగాయని అర్థమైంది. వశిష్ఠ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates