రెండేళ్ల కిందట ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో పలకరించింది అనుష్క శెట్టి. దానికి ముందు ‘నిశ్శబ్దం’ సినిమా మూడేళ్ల గ్యాప్లో వచ్చింది. ఇలా సినిమాకు సినిమాకు ఆమె చాలా గ్యాపే తీసుకుంటోంది. భారీగా అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్.. ఇంతింత గ్యాప్ తీసుకోవడం ఆశ్చర్యకరం. తన కొత్త చిత్రం ‘ఘాటి’ మొదలై కూడా ఏడాదిన్నర కావస్తోంది. వేగంగా సినిమాలు పూర్తి చేసే క్రిష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం ముందు ఏప్రిల్లో రిలీజ్ అన్నారు. తర్వాత జులై డేట్ ఇచ్చారు. కానీ రెండు డేట్లూ దాటిపోయాయి.
సినిమా ఏ దశలో ఉందో.. ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ లేదు. ఇంకో డేట్ ఇచ్చి మళ్లీ వాయిదా వేస్తే సినిమాకు అది చాలా మైనస్ అవుతుంది. అందుకే చిత్ర బృందం కొంచెం ఎక్కువ టైమే తీసుకోబోతున్నట్లు సమాచారం. జులైలో సినిమా రాదన్నది స్పష్టం. ఆగస్టు మధ్యలో ‘వార్-2’, కూలీ’ లాంటి క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. వాటికి ముందు, వెనుక వారాల్లో సినిమా రిలీజ్ చేయడం శ్రేయస్కరం కాదు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కూడా టైం పట్టేలా ఉంది కాబట్టి.. హడావుడి లేకుండా సెప్టెంబరు మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయడం మంచిదని భావిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి సంస్థలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ కూడా రెడీ అవుతోంది. దాన్ని సెప్టెంబరులో రిలీజ్ చేద్దామా అనే చర్చ జరిగింది కానీ.. ఇప్పుడు ఆలోచన మారినట్లు తెలుస్తోంది. అక్టోబరులో దాని రిలీజ్ ఉండొచ్చంటున్నారు. ఆ సంస్త నుంచి ముందు వచ్చే సినిమా అయిన ‘ఘాటి’ని సెప్టెంబరు 5కు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ డేట్ ఇస్తారని.. ఈసారి పక్కాగా ఆ తేదీకే సినిమా రిలీజ్ అవుతుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates