‘తమ్ముడు’ ని గట్టెక్కించే అన్నయ్య ఎవరో

రామ్ చరణ్, శంకర్‌ల క్రేజీ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ చేంజర్’ గురించి అభిమానులు ఎంతో ఊహించుకున్నారు. రాజు కూడా ఇది తనకు జాక్ పాట్ ప్రాజెక్టు అవుతుందనుకున్నారు. కానీ చివరికి అంతా తల్లకిందులైంది. ఈ సినిమాతో దిల్ రాజు ఎన్నడూ ఎరుగని నష్టాలు ఎదుర్కొన్నారు. ఇన్నేళ్ల ప్రొడక్షన్లో దిల్ రాజుకు వచ్చిన మొత్తం నష్టాలు ఎంత ఉంటాయో.. ఈ ఒక్క చిత్రంతో అంత నష్టపోయాడని అప్పట్లో మాట్లాడుకున్నారు. కానీ ఆ దెబ్బ నుంచి రాజు వెంటనే కోలుకున్నారు. ‘గేమ్ చేంజర్’ వచ్చిన మూడు రోజులకే రిలీజైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర అసాధారణంగా ఆడేసి భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

‘గేమ్ చేంజర్’ నష్టాలు 70 శాతం దాకా ఈ సినిమాతో భర్తీ అయిపోయినట్లు స్వయంగా రాజునే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మొత్తానికి సంక్రాంతి టైంలో రాజు అలా సేవ్ అయిపోయారు. కానీ అంతటితో కథ అయిపోలేదు. ఆరు నెలల తర్వాత రాజుకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘తమ్ముడు’ భారీ నష్టాలనే మిగిల్చింది. నితిన్ ట్రాక్ రికార్డు ఘోరంగా ఉన్నప్పటికీ.. రాజు ధైర్యంగా ఈ సినిమా మీద రూ.70 కోట్ల బడ్జెట్ పెట్టేశారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.30 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు సమాచారం.

థియేటర్ల నుంచి రూ.40 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. కానీ తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ ‘తమ్ముడు’ ఇప్పటివరకు రూ.4 కోట్లకు మించి షేర్ రాబట్టలేకపోయింది. టార్గెట్లో పది శాతం మాత్రమే రికవరీ అంటే ఇది ఎంత పెద్ద దెబ్బో అర్థం చేసుకోవచ్చు. ‘తమ్ముడు’ మీద ఏకంగా రూ.35 కోట్ల దాకా పోయిందన్నమాట. బయ్యర్లకు మంచి రేటుకు అమ్మి రాజు సేవ్ అయిపోయారు అనుకోవడానికి లేదు. రాజు బయ్యర్లందరూ ఆయన దగ్గర రెగ్యులర్‌గా సినిమాలు కొనేవాళ్లు. వాళ్లకు ఇంకో సినిమాతో నష్టాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తర్వాత ‘యెల్లమ్మ’ పట్టాలెక్కుతుంది. మరి వీటిలో ఏది ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలో మ్యాజిక్ చేసి ‘తమ్ముడు’ నష్టాలను భర్తీ చేస్తుందో చూడాలి.