వీరమల్లు.. క్రిష్ క్రెడిట్ ఎంత జ్యోతికృష్ణ క్రెడిట్ ఎంత?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ ఇంకో రెండు వారాల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అనౌన్స్ అయిందేమో ఆరేళ్ల కిందట. అప్పుడు ఆ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆయన నాలుగేళ్లకు పైగా ఆ సినిమాతో అసోసియేట్ అయ్యే ఉన్నాడు. కానీ మేకింగ్ మరీ ఆలస్యం కావడం, సినిమా ఎంతకీ పూర్తి కాకపోవడంతో క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ మిగతా చిత్రాన్ని పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నాడు. ఐతే సినిమా మేకింగ్‌లో ఎవరి క్రెడిట్ ఎంత.. ఎవరు ఏం తీశారు అనే విషయంలో అందరికీ సందేహాలు ఉన్నాయి. ఈ విషయమై ఏఎం రత్నం ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అంతే కాక క్రిష్‌ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి ముందు ఘర్షణ ఏమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి విభేదాలు కారణం కాదని రత్నం మరోసారి నొక్కి వక్కాణించారు. క్రిష్ అంటే తనకు చాలా ఇష్టమని, అతడికీ తనంటే అభిమానమని రత్నం తెలిపారు. పవన్ కళ్యాణ్‌ తనతో సినిమా చేయాలనుకున్నపుడు ముందు ‘వేదాలం’ రీమేక్ అనుకున్నామని.. ఆ చిత్రాన్ని జ్యోతికృష్ణనే దర్శకుడిగా పవన్ సూచించారని.. కానీ అప్పుడది కుదరలేదని.. తమిళ దర్శకుడు నీసన్‌తో అనుకున్న ఆ చిత్రం ముందుకు వెళ్లలేదని రత్నం తెలిపారు.

తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ మొదలుపెట్టామని.. తాను సింపుల్‌గా పవన్‌తో ఒక రీమేక్ చేసి డబ్బులు చేసుకోవచ్చని.. కానీ ఆయన స్థాయి పెంచేలా గొప్ప సినిమా తీయాలనే ఇలాంటి భారీ కథను ఎంచుకున్నానని రత్నం చెప్పారు. కానీ సినిమా అనివార్య కారణాలతో బాగా ఆలస్యం కావడం, క్రిష్‌కు వేరే కమిట్మెంట్ ఉండడంతో ఈ సినిమా నుంచి సుహృద్భావ వాతావరణంలోనే ఆయన తప్పుకున్నారని.. తర్వాత జ్యోతికృష్ణ చేతికి సినిమా వెళ్లిందని రత్నం తెలిపారు. జ్యోతికృష్ణ వచ్చి కథను, ఓవరాల్‌గా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని రత్నం తెలిపారు.

ముందు తాము ‘కొల్లగొట్టినాదిరో..’ పాట ఒక్కటే తీశామని.. సినిమాలో పాటలకు వేరే స్కోప్ లేదనుకున్నామని.. కానీ జ్యోతికృష్ణ ఇంకో రెండు పాటలను జోడించాడని చెప్పారు రత్నం. అంతకుముందు కొన్ని యాక్షన్ సీక్వెన్సులు మాత్రమే తీశామని.. కథ ఒక రూపులోకి రాలేదని.. జ్యోతికృష్ణ వచ్చాక సెకండాఫ్ మొత్తం తనే రాశాడని.. మొత్తంగా సినిమాను ఒక కొలిక్కి తెచ్చాడని రత్నం చెప్పారు. తాను స్వయంగా ఒక దర్శకుడినని.. అలాంటిది తనే జ్యోతికృష్ణ వర్క్ చూసి ఆశ్చర్యపోయానని.. కచ్చితంగా ‘హరిహర వీరమల్లు’తో పెద్ద హిట్ కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు రత్నం.