రేట్లు తేల్చుకునే పనిలో వీరమల్లు బిజీ

హరిహర వీరమల్లు విడుదలకు ఇంకో పదిహేడు రోజులు మాత్రమే ఉంది. థియేటర్ బిజినెస్ కు సంబంధించి ఇంకా బేరాలు కొలిక్కి రాలేదని ఫిలిం నగర్ టాక్. ఏపీ తెలంగాణ కలిపి సుమారు నూటా నలభై కోట్లకు పైగా నిర్మాత ఏఎం రత్నం ఆశిస్తున్నట్టు ట్రేడ్ లో మాట్లాడుకుంటున్నారు. సహజంగానే నైజాం ధర అధికంగా పలుకుతోందట. అరవై అయిదు కోట్ల దాకా డీల్ జరగొచ్చని అంటున్నారు. సీడెడ్, ఆంధ్ర, కర్ణాటక ఇంకా తుది దశల చర్చల్లో ఉన్నాయి. ఏదైనా ఇంకో రెండు మూడు రోజుల్లో తేల్చేయాలి. టైం తక్కువగా ఉన్న నేపథ్యంలో చివరి నిమిషం దాకా ఒత్తిడి పెట్టుకుంటే లేనిపోని తలనెప్పి అవుతుంది.

మొన్నటిదాకా డ్రైగా ఉన్న హైప్ ట్రైలర్ వచ్చాక పెరిగింది. ఫ్యాన్స్ కు సినిమాలో గ్రాండియర్ నెస్ అర్థమైపోయింది. దర్శకుడు జ్యోతికృష్ణ కనక సరిగా హ్యాండిల్ చేసి ఉంటే బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. ఈ బయ్యర్ల వ్యవహారం తేలితే ఏఎం రత్నం తదుపరి పనులు చూసుకోవాల్సి ఉంటుంది. టికెట్ రేట్ల పెంపు ఎంత అడగాలి, బెనిఫిట్ షోలు అర్థరాత్రి ఒంటి గంట నుంచా లేక తెల్లవారుఝామున నాలుగు గంటల నుంచి మొదలుపెట్టాలానే దాని గురించి ఇంకా కంక్లూజన్ కు రాలేదట. చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక కొలిక్కి వస్తున్న టైంలో ఇవన్నీ ఒత్తిడి పెంచే వ్యవహారాలే.

వ్యాపారం సంగతి పక్కనపెడితే హరహర వీరమల్లుకి బిగ్గెస్ట్ ఓపెనింగ్ రావడం ఖాయమే. కుబేర తర్వాత బాక్సాఫీస్ మళ్ళీ డల్ అయిపోయింది. కన్నప్ప అంచనాలు అందుకోలేదు. తమ్ముడు దారుణంగా నిరాశపరిచింది. ఓ భామ అయ్యో రామా మీద బజ్ లేదు. పద్దెనిమిదో తేదీ రిలీజయ్యే వాటికి కూడా బజ్ అంతంత మాత్రమే. సో అధిక శాతం మాస్ జనాలు థియేటర్లకు దూరంగా ఉన్నారు. ఫ్యానిజం తో సంబంధం లేకుండా వాళ్లంతా హరిహర వీరమల్లుని చూసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం రికార్డులకు ఉప్పు పాతర మొదలైపోతుంది. దాని కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్.