కూలీ పుకార్లకు రెక్కలు వచ్చాయి

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన కూలీ వాయిదా పడనుందనే వార్త సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతోంది. వార్ 2కి అత్యధిక స్క్రీన్లు బ్లాకయిపోవడంతో విధి లేని పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కానుందనే టాక్ బలంగా ప్రచారమవుతోంది. అయితే చెన్నై వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఇది కేవలం పుకారే. సన్ పిక్చర్స్ బిజినెస్ డీల్స్ చేస్తోందని, తమిళనాడుకి సంబంధించి థియేటర్ అగ్రిమెంట్లు ఆల్రెడీ ఊపుమీదున్నాయని, ఆరు నూరైనా వెనక్కు తగ్గే పరిస్థితి ఒక్క శాతం కూడా లేదని అంటున్నారు. సో వాయిదా న్యూసులన్నీ గ్యాసే.

యష్ రాజ్ ఫిలిమ్స్ చాలా ప్లాన్డ్ గా వార్ 2 స్క్రీన్లను లాక్ చేస్తున్న మాట వాస్తవమే. కానీ కూలీ సైతం దానికి ధీటుగా డిస్ట్రిబ్యూటర్లను ఎంచుకుంటూ తన వంతుగా మంచి రిలీజ్ వచ్చేలా చూసుకుంటోంది. ఒకవేళ కౌంట్ పరంగా హెచ్చుతగ్గులు ఏమైనా వచ్చినా టాక్ దెబ్బకు ఆటోమేటిక్ గా డిమాండ్ కు తగ్గట్టు థియేటర్లు వాటంతటవే పెరుగుతాయనే ధీమాలో కూలి నిర్మాతలున్నారు. అలాని వార్ 2ని ఎంత మాత్రం తక్కువంచనా వేయడానికి లేదు. టీజర్ కు ఆశించిన స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రాని మాట నిజమే అయినా ట్రైలర్ నుంచి లెక్క వేరుగా ఉంటుందని, క్వాలిటీ మొత్తం మారిపోయిందని ఇన్ సైడ్ టాక్.

దీని సంగతలా ఉంచితే కూలి ఫీవర్ ఓ రేంజ్ లో పెరుగుతోంది. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు ఇప్పటికే అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. తెలుగులో యాభై కోట్లను డిమాండ్ చేసే స్థాయిలో హైప్ వచ్చిందంటే ఆ క్రెడిట్ ఎక్కువ శాతం లోకేష్ కనగరాజ్ కే ఇవ్వాలి. ఆల్రెడీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మొదలుపెట్టేశారు. జూలై నెలాఖరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ట్రైలర్ లాంచ్ ఆగస్ట్ మొదటి వారంలో ఉంటుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ రజనీకాంత్ సరసన డ్యూయెట్లు లాంటివి ఉండకపోవచ్చని వినికిడి. చూడాలి ఏమైనా సర్ప్రైజ్ ఉంటుందేమో.