దక్షిణాది రాష్ట్రాల ఉపముఖ్యమంత్రలలో పవర్ ఫుల్ నాయకుడు ఎవరు? ప్రజలను ఏమేరకు ప్రభావితం చేస్తున్నారు? రాజకీయంగా ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తున్నారు? అనే ప్రశ్నలకు తాజాగా ఆన్లైన్ సర్వే ఒకటి సమాధానం చెప్పింది. ప్రజల నుంచి సేకరించిన సమాచారంతోపాటు.. వివిధ వర్గాల నుంచి రాబట్టిన సమాచారాన్ని క్రోడీకరించి.. ఆయా ఉప ముఖ్యమంత్రుల పనితీరును అంచనా వేసింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వస్తాయి.
వీటిలో ఒక్క కేరళలో మాత్రమే ఉప ముఖ్యమంత్రి లేరు. మిగిలిన రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. సీఎంతోపాటు.. ఉప ముఖ్యమంత్రులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఆయా రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు ఉన్నా.. ఒక్కొక్కరి తీరు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటోంది. ఇలా చూసుకున్నప్పు డు.. ఎవరు ఎలా ఉన్నారు? ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. అంతేకాదు.. ఎవరు పవర్ ఫుల్గా వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా ఉంది.
తెలంగాణ: మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే.. ఈయన సౌమ్యంగా ఉంటారనే పేరు తెచ్చుకున్నారు. బలమైన దూకుడు ప్రదర్శించడం కానీ.. సంచలన వ్యాఖ్యలు చేసి.. ప్రతిపక్షాన్ని డిఫెన్సులో పడేయడం కానీ.. చేసే తరహా నాయకుడు కాదు.
కర్ణాటక: డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈయన ఫైర్ బ్రాండ్. అంతేకాదు.. పార్టీలో షార్పు షూటర్గా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వానికి ఆక్సిజన్ ఈయనేనని అంటారు. ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నా.. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయితే.. ఈయనపై పలు కేసులు ఉన్నాయి. దీంతో సైలెంట్గానే రాజకీయాలు చేసుకుంటున్నారు. కానీ, సీఎం చాన్స్ కోసం వేచి చూస్తున్నారు.
తమిళనాడు: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వయసు చిన్నదే అయినా.. రాజకీయ చిచ్చరపిడుగుగా పేరు తెచ్చుకున్నారు. తాత నుంచి వచ్చిన వారసత్వ వాసనలో ఏమో.. సనాతన ధర్మం పై విరుచుకుపడతారు. నాస్తికత్వాన్ని మించింది లేదని చెబుతారు. ప్రతిపక్షాల నుంచి కేంద్రంలోని అధికార పక్షం పై కూడా విమర్శలు చేయడంలో ముందున్నారు. దీంతో ఫైర్ బ్రాండ్ ఉప ముఖ్యమంత్రిగా ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు.
ఏపీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. కూటమి ఏర్పాటులోను.. కూటమి ప్రభుత్వం సజావుగా సాగడంలోనూ కీలక రోల్ పోషిస్తున్నారు. అంతేకాదు.. కూటమికి కష్టాలు వస్తున్నాయని తెలిస్తే.. తన రెండు చేతులు అడ్డు పెడుతున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన కావొచ్చు.. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగి.. ప్రజల్లో నిరసన పెల్లుబుకుతోందని భావించినప్పుడు కావొచ్చు.. ఆయన లైన్లోకి వచ్చి చేసిన వ్యాఖ్యలతో కూటమిపై విమర్శలు రాకుండా తప్పించే పరిస్థితి ఏర్పడింది.
ఇక, ప్రతిపక్ష వైసీపీకి కంట్లో నలుసుగా.. మారారన్నది తెలిసిందే. దీంతో వ్యూహాత్మక రాజకీయాలు చేస్తూ.. కూటమిని కాపాడుతున్న ఉప ముఖ్యమంత్రిగా ఫస్ట్ ప్లేస్ సంపాయించారు. అంతేకాదు.. పవర్ ఫుల్ నాయకుడిగా కూడా ఉన్నారన్నది సర్వేలు చెబుతున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates