రూ.200 కోట్లకు పైగా బడ్జెట్.. మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి భారీ తారాగణం.. ఇలా చెప్పుకోవడానికి చాలా విశేషాలే ఉన్నాయి ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించి. పుష్కర కాలం కిందట ఈ సినిమాకు పునాది పడితే.. ఎట్టకేలకు అది పూర్తయి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంచు విష్ణు గత చిత్రాలు దారుణమైన ఫలితాన్ని అందుకున్నా సరే.. ఇది అతడికే కాక మంచు మోహన్ బాబుకూ డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో ఈ చిత్రంపై అసాధారణమైన బడ్జెట్ పెట్టింది ఆ కుటుంబం.
మేకింగ్ దశలో, విడుదలకు కొన్ని వారాల ముందు వరకు సోషల్ మీడియాలో నెగెటివిటీ వచ్చినా.. ట్రోల్స్ కూడా ఎదురైనా తట్టుకుని నిలబడిన విష్ణు అండ్ టీం.. ఇప్పుడు మంచి క్రేజ్ మధ్య ప్రేక్షకులను పలకరిస్తోంది.
ఈ సినిమా ఫలితం కోసం.. ఆ చిత్ర బృందమే కాదు.. తెలుగు సినిమా పరిశ్రమ, ప్రేక్షకులు కూడా అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ స్లంప్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా బాగా ఆడడం చాలా అవసరం. ప్రేక్షకులు కూడా చాన్నాళ్ల తర్వాత ఓ భారీ చిత్రాన్ని తెరపై చూడబోతున్నారు.
ఇంతకుముందు వచ్చిన సోషల్ మీడియా ట్రోల్స్ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. మంచు విష్ణు ఇన్నేళ్ల పాటు పడ్డ కష్టానికి మంచి ఫలితం దక్కాలనే కోరుకుంటున్నారు చాలామంది.
ప్రభాస్ ప్రత్యేక పాత్ర చేయడం వల్ల రిలీజ్ టైంకి సినిమాకు రావాల్సిన హైప్ వచ్చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగానే ఉన్నాయి. కావాల్సిందల్లా సినిమాకు మంచి టాకే. అది వస్తే విష్ణు అండ్ టీం చేసిన సాహసానికి మంచి ఫలితం దక్కినట్లే. ఇలాంటి భారీ ప్రయత్నాలు మరిన్ని చేయడానికి కూడా గొప్ప ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది. మరి ‘కన్నప్ప’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ‘మంచు’ వారి కల నెరవేరుస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates