మహాభారతం మీద సినిమా అనగానే చాలా ఏళ్ల నుంచి అందరికీ రాజమౌళే గుర్తుకు వస్తున్నారు. ‘బాహుబలి’ మొదలుపెడుతున్న సమయంలో మహాభారతం మీద సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు అని, దాని కోసం అనుభవం గడించే పనిలో ఉన్నానని.. ఆ సినిమా మొదలుపెట్టడానికి ఓ పదేళ్లు పట్టొచ్చని ప్రకటించి సర్వత్రా ఆసక్తి రేకెత్తించాడు జక్కన్న. బాహుబలి, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాలు చూశాక.. మహాభారతాన్ని రాజమౌళి ఎలా తీస్తాడు అనే ఊహే ప్రేక్షకులను నిలవనీయడం లేదు. కానీ తాను చెప్పిన పదేళ్ల సమయం పూర్తయినా జక్కన్న ‘మహాభారతం’ను మొదలుపెట్టలేదు.
మహేష్ సినిమా అయ్యాక అయినా ఈ దిశగా అడుగులు పడతాయేమో చూడాలి. రాజమౌళి ఆలస్యం చేసేసరికి ఆమిర్ ఖాన్ లైన్లోకి వచ్చేశాడు. తన టీంతో కలిసి భారీ స్థాయిలో ‘మహాభారతం’ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. రాజమౌళి చేయబోతుండగా.. ఆమిర్ ఈ ప్రయత్నం చేయడం అవసరమా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇంతలో ఇప్పుడు మహాభారతాన్ని భారీ స్థాయిలో సినిమాగా తీయడానికి మరో దర్శకుడు రెడీ అవుతున్నాడు. ఆయనే.. ముకేశ్ కుమార్ సింగ్. హిందీలో ‘మహాభారతం’ సీరియల్ను భారీ స్థాయిలో తీసి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ముకేశ్.
సీరియల్ అయినా సరే ‘మహాభారతం’ మీద రూ.200 కోట్లు పెట్టారంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఏ సీరియల్ దర్శకుడికీ రాని పేరు ముకేశ్కు వచ్చింది. అందులో పనితనం చూసే ‘కన్నప్ప’ సినిమాకు ఆయన్ని దర్శకుడిగా ఎంచుకున్నారు మంచు విష్ణు-మోహన్ బాబు. ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ముకేశ్.. ‘మహాభారతం’ను సినిమాగా కూడా తీయబోతున్నట్లు ప్రకటించారు. ఆల్రెడీ ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని.. ‘కన్నప్ప’ రిలీజ్ తర్వాత పూర్తి వివరాలు ప్రకటిస్తానని ముకేశ్ తెలిపారు. ముందేమో ఆమిర్, ఇప్పుడేమో ముకేశ్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు ‘మహాభారతం’ ప్రాజెక్టులను అనౌన్స్ చేసేస్తున్నారు. మరి మన జక్కన్న ఎప్పుడు ఈ సినిమాను మొదలుపెడతాడో?
Gulte Telugu Telugu Political and Movie News Updates