విడుదలకు ముందు జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ ఇది ఏ హీరో సినిమా కాదని, కేవలం శేఖర్ కమ్ముల మూవీ అని, ఒక మాయాబజార్ లా ఇది అందరికీ చెందుతుందని చెప్పడం ప్రేక్షకులకు గుర్తే. రిలీజ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో ఆయనే మాట్లాడుతూ ఇది దీపక్ పాత్ర చుట్టూ తిరిగే కథ కాబట్టే ఒప్పుకున్నానని చెప్పడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మీమ్స్ పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ధనుష్ ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయి ఇప్పుడు మాట మారుస్తారా అంటూ ట్వీట్లు పెట్టడం బాగానే ట్రెండ్ అయ్యింది. ఇవన్నీ నేరుగా నాగార్జున దృష్టికి వెళ్లిపోయాయి. దానికాయన స్పందించారు.
కుబేర సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ తాను అప్పుడూ ఇప్పుడు ఒకేమాట మీద ఉన్నానని, కుబేర ముమ్మాటికీ శేఖర్ కమ్ముల సినిమానేనని, తాను వేరే ఉద్దేశంలో అన్నది ఇంకో అర్థంలో బయటికి వెళ్ళిపోయి మీమ్స్ వచ్చాయని అంతే తప్ప ఇంకేమి లేదని కుండ బద్దలు కొట్టేశారు. తాను, ధనుష్, రష్మిక మందన్న, ఇతర ఆర్టిస్టులు ఎవరూ కూడా పేర్లతో కాకుండా క్యారెక్టర్లతో గుర్తుండిపోయేలా గొప్ప కథను శేఖర్ కమ్ముల తెరకెక్కించారని కితాబిచ్చారు. సోలో హీరోగా కాకుండా కుబేర విషయంలో రిస్క్ అనిపించే నిర్ణయాన్ని తీసుకున్న నాగార్జున దానికి తగ్గ గొప్ప ఫలితాన్ని అందుకోవడం పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నారు.
దీన్ని బట్టి సోషల్ మీడియా ట్రెండ్స్ సెలబ్రిటీలు ఎంత సీరియస్ గా ఫాలో అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతిదీ చూడకపోయినా టీమ్ తరఫున ఎవరో ఒకరు వీటిని వాళ్ళ దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. కుబేరలో హీరో ఎవరనే డిబేట్ కూడా నిన్న ట్విట్టర్ వేదికగా జరిగింది. వాటన్నింటికి ఇవాళ చెక్ పడినట్టే. ధనుష్ సైతం నాగార్జున కన్నా ముందు తనే మాట్లాడ్డం ద్వారా మరో పాజిటివ్ సంకేతం ఇచ్చాడు. ఇప్పుడీ కుబేర ఇచ్చిన సక్సెస్ కిక్ తో నాగార్జున ఆగస్ట్ 14 రాబోయే కూలీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే దర్శక రచయితలకు కొత్త పాత్రలు సృష్టించడంలో ఛాలెంజ్ దొరికినట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates