ప్రభుత్వాన్ని వణికించే ‘కుబేర’ వ్యూహం

జూన్ 20 విడుదల కాబోతున్న కుబేర కోసం ధనుష్, నాగార్జున ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటిసారి కుదిరిన మల్టీ స్టారర్ కాంబినేషన్ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందులోనూ శేఖర్ కమ్ముల దర్శకత్వం వల్ల ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. బిజినెస్ పరంగా మంచి హైప్ తెచ్చుకున్న కుబేరకు భారీ బడ్జెట్ అయ్యింది. కొంచెం ఆలస్యమైనా సరే క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా కమ్ముల దీన్ని తెరకెక్కించారు. టీజర్ లో సాంపిల్ చూపించాక అందరి దృష్టి ట్రైలర్ మీద ఉంది. ఇవాళ హైదరాబాద్ లో రాజమౌళి అతిథిగా జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దాన్ని లాంచ్ చేశారు.

స్టోరీ ఎక్కువగా దాచకుండా చెప్పేశారు. ఆయిల్ తో పాటు వివిధ వ్యాపారాల పెట్టుబడులతో కోట్లకు పగడలెత్తిన వ్యాపారవేత్త (జిమ్ షర్బ్) దాన్ని అంతులేని సంపద మార్చేందుకు ప్రభుత్వ పెద్దలతో చేతులు కలుపుతాడు. గవర్నమెంట్ ఆఫీసర్ గా బాధ్యత కలిగిన పదవిలో ఉన్న దీపక్ ( నాగార్జున) ఒక లక్ష్యం కోసం బిచ్చగాడైన దేవా (ధనుష్) ని చేరదీసి అతనికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. అయితే కీలకమైన సమయంలో దేవా మాయమైపోతాడు. దీంతో వందల కోట్ల విలువైన సొమ్ము రిస్కులో పడుతుంది. దేవా, ధనుష్ ల మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ తర్వాత జరిగేది థియేటర్లలో చూడాలి మరి.

శేఖర్ కమ్ముల మార్క్ నిండిన కుబేరలో ఈసారి ఎమోషన్స్, లవ్ లాంటివి కాకుండా మనీ క్రైమ్ తో కూడిన సీరియస్ నెరేషన్ ఎంచుకోవడం విభిన్నంగా ఉంది. ప్రతి పాత్రకు ప్రాధాన్యం దక్కేలా డిజైన్ చేసిన విధానం ఆకట్టుకునలా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం లాంటి టెక్నికల్ సపోర్ట్ కుబేరకు అండగా నిలిచింది. హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి లాంటి సాఫ్ట్ మూవీస్ కి భిన్నంగా కుబేర రాసుకున్న శేఖర్ కమ్ముల, ఈసారి లీడర్ ని మించిన అరెస్టింగ్ డ్రామా ఇస్తాడనే నమ్మకమైతే ఈ వీడియోలో ఇచ్చేశారు. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే అంతకన్నా ఫ్యాన్స్ కోరుకునేది ఏముంది.