-->

కొత్త మలుపు – ఏషియన్ సునీల్ రాజీనామా

సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ డిమాండ్ చేయడం ఎప్పుడు మొదలయ్యిందో కానీ చిన్న కార్చిచ్చులా మొదలై ఇప్పుడు మొత్తం అడవిని చుట్టేసింది. హరిహర వీరమల్లుని టార్గెట్ చేశారనే వివాదం, దానికి అల్లు అరవింద్ – దిల్ రాజులు వివరణ ఇవ్వడం, పలువురు ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్లు పెట్టి ఆసలు థియేటర్లు బంద్ చేసే ఉద్దేశమే లేదంటూ ప్రెస్ మీట్లు పెట్టడం, ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ ఒక కమిటీ వేయడం లాంటి పరిణామాలు చాలానే జరిగాయి. ఒకపక్క బాక్సాఫీస్ డ్రైగా ఉంటూ సరైన సినిమాలు లేక ఖాళీ సీట్లతో గగ్గోలు పెడుతున్న టైంలో ఈ సంఘటనలన్నీ గాయం మీద కారాన్ని చల్లినట్టు అయ్యింది.

తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఎంపికైన సునీల్ నారంగ్ పదవి చేపట్టిన ఒక్క రోజు లోపే రాజీనామా సమర్పించడం సంచలనంగా మారింది. రెండు పర్యాయాలు ఈ పదవిని నిర్వహించిన సీనియర్ మోస్ట్ నిర్మాత ఇలా చేయడం అందరిని విస్మయ పరుస్తోంది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో సెక్రటరీ సుధాకర్ హీరోల గురించి, ఇద్దరు దర్శక నిర్మాతల గురించి చేసిన కామెంట్లు చాలా దూరం వెళ్ళాయని, వాటితో సంబంధం లేకపోయినా తన పేరుని జోడించి ప్రచారం చేయడం పట్ల మనస్థాపం చెందడం వల్లే సునీల్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. రాజీనామా లేఖను ఛాంబర్ కు పంపించేశారు.

అసలే ఐక్యత లేక ఎవరి గోల వాళ్లదే తరహాలో మారిపోయిన టాలీవుడ్ లో ఇప్పుడు జరుగుతున్నవన్నీ అంతు చిక్కని ప్రశ్నలు గా మిగల్చబోతున్నాయి. రెంటల్, పర్సెంటెజ్ కన్నా తీవ్రమైన సమస్యలు పరిశ్రమలో ఉన్నాయని అర్థమవుతోంది. నిన్నటి దాకా అంతర్గతంగా ఉన్న ఛాంబర్ విషయాలు ఇప్పుడు సామాన్యులకు కూడా చేరిపోతున్నాయి. ఎంత దూరం వెళ్తాయనేది పక్కన పెడితే సీనియర్లు ఎవరో ఒకరు పూనుకుని వీటికి పరిష్కారం చూపాల్సిన అవసరం చాలా ఉంది. సంక్షోభం దిశగా వెళ్తున్న ఇండస్ట్రీని అందరూ కలిసి నిలబెట్టుకోవాలి. ఐకమత్యమే మహాబలమనే సామెత పాతదే అయినా ఇప్పుడు ఆచరించాల్సిన టైం వచ్చింది.