పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ ముందుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైంది. ఆయన నాలుగేళ్లకు పైగా ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉన్నారు. కానీ మరీ ఆలస్యం కావడంతో ఆయనీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ సినిమాను భుజాలకెత్తుకున్నాడు. తన దర్శకత్వంలోనే గత నెలలో సినిమా పూర్తయింది. ఐతే ఈ సినిమాలో ఎవరు ఏ సన్నివేశాలను తీశారు.. క్రిష్ క్రెడిట్కు ఎంత శాతం సినిమా వస్తుంది.. జ్యోతికృష్ణ సినిమా తీశాడు అనే విషయాల్లో జనాలకు సందేహాలున్నాయి.
అంతే కాక క్రిష్ స్క్రిప్టుతోనే సినిమాను పూర్తి చేశారా.. జ్యోతికృష్ణ వచ్చాక కథ, సన్నివేశాల పరంగా మార్పులేమైనా జరిగాయా అనే విషయంలోనూ క్లారిటీ లేదు. ఒకసారి ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చాక క్రిష్ ‘హరిహర వీరమల్లు’ గురించి మాట్లాడింది లేదు. ఆయనసలు మీడియాకు అందుబాటులోనే లేదు. ‘వీరమల్లు’ టీంతో ప్రస్తుతం క్రిష్కు ఎలాంటి సంబంధాలున్నాయి.. రిలీజ్ ముంగిట ఈ సినిమా గురించి ఆయన ఏమైనా మాట్లాడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి టైంలో నిర్మాత ఏఎం రత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రిలీజవ్వడానికి ముందు క్రిష్కు స్పెషల్ షో వేసి చూపించబోతున్నట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. క్రిష్ అనివార్య పరిస్థితుల్లోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నారని.. ఇది సుహృద్భావ వాతావరణంలో తీసుకున్న నిర్ణయమే అని ఆయన తెలిపారు. క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాక స్క్రిప్టు, మేకింగ్లో చాలా మార్పులు జరిగినట్లు రత్నం తెలిపారు. రేప్పొద్దున క్రిష్కు సినిమా చూపిస్తామని.. అప్పుడు తాము చేసిన మార్పులు చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతారని.. ఆయన అనుకున్న దాని కంటే బాగా సినిమా వచ్చిందని రత్నం వ్యాఖ్యానించారు.
ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో, మీడియాలో చాలామంది నెగెటివ్గా రాస్తున్నారని.. ఈ సినిమా పూర్తే కాదని చాలామంది అనుకున్నారని.. పూర్తయితే ఆశ్చర్యపోతున్నారని.. రేప్పొద్దున సినిమా చూసి కూడా అందరూ ఆశ్చర్యపోతారని.. ఇంత గ్రాండ్గా, ఇంత గొప్పగా తీశారేంటని అనుకుంటారని రత్నం ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 12న రావాల్సిన ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కావచ్చు.