సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల స్టేజ్ మీద అదుపు తప్పి మాట్లాడ్డం ద్వారా రెండుసార్లు తీవ్ర విమర్శల పాలయ్యారు. ‘రాబిన్ హుడ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ను ఉద్దేశించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానికి క్షమాపణలు చెప్పడం తెలిసిందే. తాజాగా సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో ఆలీని ఉద్దేశించి మాట్లాడిన బూతు మాట.. అదే ఈవెంట్లో చేసిన మరి కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తర్వాత ‘షష్ఠిపూర్తి’ సినిమా ఈవెంట్లో తన వ్యాఖ్యలను సమర్థించుకోవడమే కాక, తప్పుగా అర్థం చేసుకుంటే మీ కర్మ అనడం మరింత విమర్శలకు దారి తీసింది. ఐతే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ వెనక్కి తగ్గారు.
ఇకపై తాను ఎవ్వరి గురించి అలా మాట్లాడనని.. కనీసం ఏకవచనంతో కూడా సంబోధించనని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా కాలంలో ఇంతకుముందులా ప్రేమాభిమానాలు చూపించే పరిస్థితి లేదంటూ ఆయన ఒకింత నిర్వేదంతో మాట్లాడారు. ‘‘నేనేదో చనువుతో సరదాగా అలా అన్నాను. నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ప్రేమతో అన్నానని అలీ కూడా వివరణ ఇచ్చుకున్నాడు. నిజాయితీగా నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు. ఆ మాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఇన్నేళ్లు యాక్టర్గా ఎలా ఉంటాను? అయితే ఇప్పుడు మాత్రం నేను చాలా హర్ట్ అయ్యాను. జీవితంలో ఇంకెప్పుడూ కూడా ఎవరినీ ఏకవచనంతో పిలవను.
అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను అంటే… సీనియర్ ఎన్టీఆర్ నుంచి. ఆయన చిన్నవారిని కూడా నువ్వు అనే వారు కారు. మీరు అనే వారు. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు కూడా అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను. ఇంకో రకంగా జీవితంలో ఇంకెప్పుడూ మాట్లాడను. నేను మాట్లాడిన వారంతా నా కుటుంబ సభ్యులే. నిజానికి ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్డే అంటే పర్సనల్ ఫంక్షన్ అనుకున్నాను. కెమెరాలు ఉన్నాయని పట్టించుకోలేదు. అక్కడున్న అందరూ నాతో పనిచేసిన బిడ్డలే.. వాళ్లందరినీ ఎంతో బాగా పొగిడాను. పూర్తి వీడియో చూస్తే మీకే తెలుస్తుంది నేనేం మాట్లాడానో. చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. అయినా నేటి సోషల్ మీడియా యుగంలో పాత రోజుల్లోలాగా ప్రేమ, ఆత్మీయత చూపించుకునే పరిస్థితి లేదు. నేను నా హద్దుల్లో ఉండడం మంచిదని నేర్చుకున్నా. ఇకపై ఎవర్నీ నువ్వు అనను, మీరు అనే అంటాను’’ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.