OG…ఎలాంటి బ్రేకులు లేవు కానీ

హరిహర వీరమల్లు సంగతేమో కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టుకున్న సినిమా ఓజి. సెప్టెంబర్ 25 విడుదల తేదీని ఆల్రెడీ ప్రకటించేయడంతో దానికి అనుగుణంగా బ్యాలన్స్ షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవలే ముంబైలో కీలక ఎపిసోడ్స్ షూట్ చేశాడు దర్శకుడు సుజిత్. విలన్ ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ రావడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తింది కానీ ఎట్టకేలకు తన కాంబో సీన్లు దాదాపు పూర్తి చేసినట్టు సమాచారం. రేపటి నుంచి ప్రారంభం కాబోయే విజయవాడ షెడ్యూల్ ని పది రోజుల పాటు జరపనున్నారు. ఇక్కడితో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన బాధ్యత పూర్తయినట్టే.

థాయ్ లాండ్ లో ఒక రెండు రోజుల వర్క్ ఉంది కానీ దానికి వెళ్తారా లేదానేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నెలాఖరు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయబోతున్నారు. పవన్ ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించి కొన్ని డీ ఏజింగ్ సన్నివేశాలు ఉండటం వల్ల వాటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నట్టు వినికిడి. ఇదే తరహాలో గుడ్ బ్యాగ్ అగ్లీ చూపించిన అజిత్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి మించిన స్థాయిలో ఓజిలో డిజైన్ చేశారని చెబుతున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ తో ఇంకో సాంగ్ బ్యాలన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడది లేకపోయినా కథకు వచ్చే ఇబ్బందేం లేదు కాబట్టి తీసే ఆలోచన డ్రాప్ అయినట్టు తెలిసింది.

అంతా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికతో జరిగిపోతుంది. అయితే సెప్టెంబర్ 25 విడుదలకు కట్టుబడటం గురించి ఫిలిం నగర్ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే అఖండ 2 ఆ డేట్ నుంచి తప్పుకునే ఆలోచన లేదని నందమూరి వర్గాల్లో వినిపిస్తోంది. బయ్యర్లు మాత్రం డిసెంబర్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి బాలయ్య నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. తమన్ కంపోజ్ చేసిన ఓజి పాటల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లు రిలీజయ్యేంత వరకు ఓజికి ఎలాంటి ప్రమోషన్లు చేయకూడదని డివివి బృందానికి పవన్ కళ్యాణ్ సూచించినట్టు టాక్.