వీరమల్లు వాయిదా వలన ఎంత నష్టం?

టాలీవుడ్ నుంచి రాబోతున్న తర్వాతి భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు సంబంధించి తర్జన భర్జనలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని చివరగా ప్రకటించిన జూన్ 12న కూడా రిలీజ్ చేయడం సందేహంగానే ఉంది. బిజినెస్ పరంగా తలెత్తిన కొన్ని ఇబ్బందులు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల సినిమాను మరోసారి వాయిదా వేయక తప్పని పరిస్థితి తలెత్తుతోందని వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. వాయిదా అనివార్యం అనే అంటున్నారు.

ఐతే వాయిదా నిర్ణయం తీసుకోవడం కూడా అంత తేలిక కాదు. ఓటీటీ సంస్థకు హక్కులు అమ్మాకే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. భారీ మొత్తానికే డీల్ కుదిరింది. కానీ ఇప్పుడు వేరే కారణాలతో సినిమాను వాయిదా వేస్తామంటే ఓటీటీ సంస్థ ఒప్పుకునే పరిస్థితి లేదు. డిజిటల్ రిలీజ్‌ స్లాట్ చూసుకున్నాకే ఓటీటీ సంస్థలు డీల్స్ చేసుకుంటాయి. చెప్పిన డేట్ దాటితే ఊరుకోరు. ఆ మేరకు రేట్లు తగ్గించి ఒప్పందాలు రివైజ్ చేస్తారు. ‘హరిహర వీరమల్లు’కు ఇప్పుడు డేట్ మారిస్తే.. ఓటీటీ సంస్థ ముందుగా చేసుకున్న ఒప్పందంలో రూ.20 కోట్ల కోత విధిస్తుందట.

అందుకే నిర్మాత ఏఎం రత్నం.. ఎలాగైనా జూన్ 12కే సినిమాను తీసుకురావాలని గట్టిగా ప్రయత్నించారు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఈ లోపు బిజినెస్ పూర్తి చేయడం, సినిమాను పర్ఫెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కష్టమవుతోంది. ఓటీటీ డీల్ కంటే థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ కాబట్టి సినిమాను జూన్ 12న రిలీజ్ చేయడం కష్టంగా ఉంది. మరి తర్వాతి డేట్‌కు అయినా నిర్మాత కోరుకున్న థియేట్రికల్ ఆదాయం వస్తుందా అన్నది సందేహం. డిజిటల్ డీల్ ఆదాయంలో పడే కోతను కూడా ఇప్పుడు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రేట్లు పెంచితే బయ్యర్లు ఎలా ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకం.