నిన్న హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. రాత్రి ఐపిఎల్ కప్పుని బెంగళూరు గెలిచి ట్రెండింగ్ లోకి వచ్చే దాకా పవన్ సినిమా పోస్టులు, సమర్ధింపులు, ట్రోలింగులు, కౌంటర్లే కనిపించాయి. నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వనప్పటికీ జూన్ 8 ప్లాన్ చేసుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేయడం, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర విడుదలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం పోస్ట్ పోన్ ని ధృవీకరించింది. జూన్ 12 థియేటర్ల దగ్గర సందడి చేయడం కోసం సర్వం సిద్ధం చేసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశ గురించి చెప్పనక్కర్లేదు.
అయిదేళ్ల నుంచి హరిహర వీరమల్లుకీ కష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు మొదలుపెట్టిన కొన్ని రోజులకే కరోనా వచ్చింది. దాంతో నెలల తరబడి ఆపేశారు. ఓసారి భారీ ఎత్తున వేసిన సెట్లు హోరు వర్షానికి కూలిపోయాయి. మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. దర్శకుడు క్రిష్ ఎక్కువ కాలం దీని మీద ఉండలేక పక్కకు వెళ్ళిపోతే ఆ బాధ్యతను రత్నంగారబ్బాయి జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో పవన్ మూడు రీమేకులు రిలీజైపోయాయి. అలా నెలలు సంవత్సరాలు గడిచిపోయి ఎట్టకేలకు మోక్షం దక్కిందనుకున్న టైంలో మళ్ళీ అవాంతరాలు మొదలయ్యాయి. ఇప్పుడు కూడా కొత్త డేట్ మీద క్లారిటీ లేదు.
సైలెంట్ గా వాయిదా పడితే ఇబ్బంది లేదు. కానీ థియేటర్ల బంద్ విషయంలో హరిహర వీరమల్లు మీద పెద్ద ఫోకస్ పడింది. అల్లు అరవింద్, దిల్ రాజు, ఆర్ నారాయణమూర్తి, పలువురు ఎగ్జిబిటర్లు దీని గురించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ వివరణలు, నిలదీతలు, మద్దతులు వగైరా చేశారు. తీరా చూస్తే ఇప్పుడా వీరమల్లే పక్కకు తప్పుకుంది. ప్రస్తుతానికి ఎవరూ మాట్లాడ్డం లేదు కానీ ఈ మాత్రం దానికి హడావిడి ఎందుకు చేశారంటూ ఎవరో ఒకరు ఇష్యూని మళ్ళీ తిరగదోడినా ఆశ్చర్యం లేదు. ఇది సాక్ష్యాత్తు హరహరుడు పెట్టిన పరీక్షని తట్టుకోవడం మినహా నిర్మాత ఏఎం రత్నం, అభిమానులకు వేరే ఆప్షన్ లేదు. జరిగేదంతా మంచికే అనుకోవడం తప్ప.