ఫ్యాన్స్ టెన్షన్ : వీరమల్లు మీద కొత్త ప్రచారం

జూన్ 12 విడుదల కాబోతున్న హరిహర వీరమల్లుకు సంబంధించి పనులన్నీ జరిగిపోతున్నాయి కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేవని ఫ్యాన్స్ భావిస్తున్న తరుణంలో రెండు రకాల ప్రచారాలు అయోమయంలోకి నెడుతున్నాయి. ఒకపక్క తిరుపతి ఎస్వి  యూనివర్సిటి ప్రాంగణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అనుమతి అడిగిన లేఖ బయటికి వచ్చింది. ఇంకోవైపు నిర్మాత ఏఎం రత్నం ఫిలిం ఛాంబర్ ని కలిసి ఏపీ టికెట్ రేట్ల పెంపు కోసం లెటర్ అందించారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని పర్సనల్ గా కలిసి బెనిఫిట్ షోలు, రేట్ల గురించి చర్చించి వచ్చారు. సెన్సార్ రేపో ఎల్లుండో అయిపోతుందని టీమ్ చెబుతూ వస్తోంది.

ఇదంతా చక్కగా జరిగిపోతున్న టైంలో హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా పడొచ్చనే టాక్ అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా నిప్పు లేనిదే పొగరాదు తరహాలో దీని గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సాంకేతిక కారణాలని ఒకరు ఆర్థిక లావాదేవీలని మరికొందరు ఇలా ఏవేవో వర్షన్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అయిదేళ్ల నిర్మాణంతో పాటు బోలెడు వాయిదాలు చవి చూసిన హరిహర వీరమల్లు మీద బజ్ ఆశించిన స్థాయిలో లేదు. సరే ట్రైలర్ వచ్చాక అన్నీ సర్దుకుంటాయనుకొనే లోపే ఇప్పుడీ పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

అఫీషియల్ గా ఏదీ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి హరిహర వీరమల్లు జూన్ 12కి కట్టుబడినట్టే. ఒకవేళ ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే జూలైకి వెళ్లాల్సి రావొచ్చు. కానీ ఆ నెల పెద్ద సినిమాలతో ప్యాకవుతోంది. నిజానికి అనుకున్న టైం సిజి వర్క్ అయిపోయి ట్రైలర్ వచ్చేసి ఉంటే ఈ డిస్కషన్లు జరిగేవి కాదు. కానీ విఎఫ్ఎక్స్ ఇంకా బ్యాలన్స్ ఉందనే అంతర్గత సమాచారం లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఏఎం రత్నం దీనికి సంబంధించి మరోసారి మీడియా ముఖంగా వాయిదా లేదని చెప్పేదాకా ఈ న్యూస్ ఆగేలా లేదు. ఎందుకంటే మిగిలింది ఉన్నది తొమ్మిది రోజులే.