ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేసిన నటుడు మంచు మనోజ్. కరెంటు తీగ, బిందాస్, పోటుగాడు లాంటి హిట్లు.. నేను మీకు తెలుసా, మిస్టర్ నూకయ్య లాంటి విలక్షణ చిత్రాలతో అతను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ‘వేదం’లో అతను చేసిన స్పెషల్ రోల్ కూడా ప్రశంసలందుకుంది. ఇలాంటి నటుడు.. ఎనిమిదేళ్ల పాటు సినిమాలకు దూరం కావడం అనూహ్యం. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత అతను అనూహ్యంగా కనుమరుగైపోయాడు.
మధ్యలో పునరాగమనం కోసం కొన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఎట్టకేలకు ‘భైరవం’ సినిమాతో మనోజ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. తాను సినిమాలకు దూరమై, వ్యక్తిగత జీవితంలో సమస్యల్లో ఉన్నపుడు తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండగా నిలిచిన విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనోజ్ గుర్తు చేసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియదని, తాను కూడా ఎక్కడా చెప్పలేదని అంటూ అతను పవన్ తనలో ఎలా ధైర్యం నింపాడో వెల్లడించాడు.
తాను సినిమాలకు దూరమై, కుటుంబ విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో ఒకసారి పవన్ను ఒక కార్యక్రమంలో కలిసినట్లు మనోజ్ వెల్లడించాడు.
పవన్ తనను హత్తుకుని పక్కకు తీసుకువెళ్లి మాట్లాడాడని.. అసలు ఏమైపోయావు, ఎక్కడుంటున్నావు, సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నావు అని వాకబు చేశాడట పవన్. అప్పుడు తాను మౌనికతో ఉంటున్నట్లు చెప్పి.. లాక్ డౌన్ తర్వాత కొంత కాలంగా చెన్నైలోనే నివాసం ఉంటున్నామని చెప్పానన్నాడు మనోజ్. తాను చెన్నై వచ్చినపుడు కలుస్తా అని చెప్పిన పవన్.. అన్నీ పక్కన పెట్టి మళ్లీ సినిమాల్లోకి రావాలని గట్టిగా చెప్పాడన్నాడు.
అప్పుడు తాను బాగా బరువెక్కి షేపవుట్ కావడం చూసి.. ముందు వర్కవుట్లు చేసి బరువు తగ్గు.. తర్వాత తాను ఎంత మంచి నటుడో గుర్తు చేస్తూ హీరో, విలన్, క్యారెక్టర్ రోల్స్ అని చూడకుండా అన్ని పాత్రలూ చేయాలని.. మల్టీస్టారర్ సినిమాల్లోనూ నటించాలని పవన్ సూచించాడన్నాడు. ప్రస్తుతం తాను ‘భైరవం’ లాంటి మల్టీస్టారర్, ‘మిరాయ్’ విలన్ పాత్ర చేశానంటే అది పవన్ చెప్పిన మాటల వల్లే అని.. ఆయన తనను ఎంతగానో మోటివేట్ చేశాడని మనోజ్ తెలిపాడు.