-->

OG విలన్ తెచ్చిన కొత్త సమస్య

పవన్ కళ్యాణ్ అభిమానులు సెప్టెంబర్ 25 ఎప్పుడు వస్తుందాని కళ్ళను దీపాలు చేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. బ్యాలన్స్ షూటింగ్ ఇటీవలే ముంబైలో మొదలైన సంగతి తెలిసిందే. చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతంలో తీసిన మొబైల్ ఫుటేజ్ లో పవన్ రెట్రో గెటప్ చూసి ఫ్యాన్స్ మాములు ఎగ్జైట్ అవ్వడం లేదు. బెల్ బాటమ్ ప్యాంటుతో అల్ట్రా స్టైలిష్ గా ఉన్న పవర్ స్టార్ ని చూసి తెగ మురిసిపోతున్నారు. దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైంది. అయితే ఓజి విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ వల్ల ఊహించని సమస్య ఒకటొచ్చిందని బాలీవుడ్ టాక్.

ఆరే కాలనీలో ఉన్న గోరెగావ్ ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు అక్కడి వాతావరణం వల్ల ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ జబ్బు వచ్చిందట. లక్షణాలు తీవ్రం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించడంతో తన భాగం వరకు కొంత బ్రేక్ ఇవ్వక తప్పడం లేదని అంటున్నారు. నిజానికి ఇంతకు ముందు పవన్, ఇమ్రాన్ కాంబోలో ఎలాంటి షూట్ జరగలేదు. తాజా షెడ్యూల్ లోనే అది మొదలయ్యింది. ఈలోగా డెంగ్యూ ట్విస్టు ఇవ్వడంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. దర్శకుడు సుజిత్ ప్రస్తుతం ఇతర ఎపిసోడ్లను ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నాడు.

ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించిన డేట్ కే విడుదల చేసేలా డివివి ఎంటర్ టైన్మెంట్స్ సర్వ సన్నద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే పవన్ డేట్స్ ఇస్తానని హామీ ఇవ్వడంతో పాటు వెంటనే రంగంలోకి దిగారు. రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే వీలైనంత వేగంగా తన భాగాన్ని తీసేందుకు సహకరిస్తున్నట్టు తెలిసింది. ఓజి ఒక భాగమా లేక సీక్వెల్ ఉంటుందా అనేది మాత్రం బయటికి రావడం లేదు. తొలుత పార్ట్ 2 ఉందన్నారు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అయ్యాక హరిహర వీరమల్లు 2 తప్ప మరో సినిమా చేసే ఆలోచనలో పవన్ లేడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. క్లారిటి అయితే ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు.