‘వీరమల్లు’ కథేంటి అంటే..

తెలుగులో చాన్నాళ్ల తర్వాత రాబోతున్న పెద్ద సినిమా.. హరిహర వీరమల్లు. ఆరేళ్ల కిందట మొదలై.. షూటింగ్ చాలా ఆలస్యం అయిన ఈ చిత్రం.. విడుదల తేదీని కూడా పలుమార్లు మార్చుకుంది. ఎట్టకేలకు జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈసారి సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదు. విడుదలకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ప్రమోషన్లు కూడా నడుస్తున్నాయి. ఇటీవలే చిత్ర బృందం ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ పెట్టింది.

మరోవైపు హీరోయిన్ నిధి అగర్వాల్.. మీడియా ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది. ఆమె పాన్ ఇండియా స్థాయిలో సినిమాను ప్రమోట్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఒక హిందీ ఇంటర్వ్యూలో ‘హరిహర వీరమల్లు’ కథ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది నిధి. ‘హరిహర వీరమల్లు’ ఔరంగజేబు కాలం అయిన 17వ శతాబ్దంలో నడిచే కథ అట. పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నట్లు ఆమె వెల్లడించింది. పవన్ పాత్రను కొంచెం ఆయన నిజ జీవిత క్యారెక్టర్‌ను దృష్టిలో ఉంచుకుని, అలాగే కొంచెం కల్పన జోడించి తీర్చిదిద్దారట.

దొరల నుంచి దోచుకుని పేదలకు పంచి పెట్టే పాత్రలో పవన్ కనిపిస్తాడని.. ఈ కథ కొంతమేర కోహినూర్ వజ్రం చుట్టూ కూడా తిరుగుతుందని నిధి వెల్లడించింది. పవన్ పాత్రే సినిమాకు మేజర్ హైలైట్ అని ఆమె చెప్పింది. తన పాత్రకు కూడా కథలో ఎంతో ప్రాధాన్యం ఉంటుందని, తన కెరీర్లో ఇది చాలా స్పెషల్ సినిమా అని నిధి తెలిపింది. క్రిష్ స్క్రిప్టుతో ఆయన దర్శకత్వంలో మొదలైన ‘హరిహర వీరమల్లు’.. షూటింగ్ చాలా ఆలస్యం కావడం వల్ల.. చివరి దశలో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ చేతుల్లోకి వచ్చింది. దయాకర్ రెడ్డి అనే నిర్మాతతో కలిసి రత్నం ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. దీని బడ్జెట్ రూ.200 కోట్లకు పైమాటే అని సమాచారం.