ఇప్పుడు సినిమా ఎలా ఉంది అన్న దాని కంటే.. ఎంత ఓపెనింగ్స్ రాబట్టింది.. ఓవరాల్గా ఎంత వూలు చేసింది అన్నదే చర్చనీయాంశంగా మారింది. సినిమా మొదలైనప్పుడే దాని కలెక్షన్ టార్గెట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. వెయ్యి కోట్ల వసూళ్లు అన్నది ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీకీ ఒక బెంచ్ మార్క్ అయిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్ ఎప్పుడో ఈ ఘనతను అందుకున్నాయి. కానీ దేశంలో పెద్ద ఇండస్ట్రీల్లో ఒకటైన కోలీవుడ్ మాత్రం ఇంకా ఆ మార్కును అందుకోలేదు.
ఇదే విషయమై తమిళ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ఆయన తనదైన శైలిలో బదులిచ్చారు. తాను వెయ్యి కోట్ల సినిమా చేయలేనని తేల్చి చెప్పిన ఆయన.. తన వరకు ఎంత మంచి సినిమా తీశామన్నదే ముఖ్యం అని అని చెప్పారు.
“ఒకప్పుడు బాగున్న సినిమా, బాలేని సినిమా అనేది మాత్రమే మాట్లాడుకునేవాళ్లం. ఫిలిం మేకర్స్ అయినా సరే.. ప్రేక్షకులు అయినా సరే ఇదే చూసేవారు. సినిమా బాగుండి దానికి మంచి వసూళ్లు వస్తే అది బోనస్. ముందు మంచి సినిమా తీయడమే లక్ష్యంగా ఉండేది. ఒక దర్శకుడు మంచి సినిమా తీస్తే దాన్ని మించి తీయాలని మరొకరు చూసేవాళ్లు. తమ గత చిత్రాన్ని మించి గొప్ప సినిమా తీయాలని కోరుకునేవారు. ఎప్పుడూ అలాగే ఉండాలి. కలెక్షన్ అనేది తర్వాతి విషయం.
కానీ ఇప్పుడు సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. అసలు విషయాల కంటే దీని మీద ఎక్కువ దృష్టి ఎక్కువ ఉంటోంది. అది శ్రేయస్కరం కాదు. నా దృష్టిలో మంచి సినిమా, చెడ్డ సినిమా ఇవే ఉంటాయి. నేనైతే వెయ్యి కోట్ల సినిమా చేయలేను. అలా వసూళ్లను ప్రామాణికంగా తీసుకుని సినిమా చేయను. నా దృష్టి వసూళ్ల కంటే కంటెంట్ మీదే ఉంటుంది. లెక్కలేసుకుని సినిమా చేయలేను” అని మణిరత్నం స్పష్టం చేశారు.