గత కొన్ని నెలలుగా మంచు వారి కుటుంబ గొడవ ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇంటి దగ్గర గొడవ పడ్డారు. పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కేసులు పెట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
ఇద్దరూ ఈ మధ్య మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు పరోక్షంగా కౌంటర్లు వేసుకున్నారు. కాగా ఇప్పుడు మంచు మనోజ్ మీడియా ఇంటర్వ్యూల్లో తమ కుటుంబ గొడవ గురించి మరింత ఓపెన్ అవుతున్నాడు. అసలు అన్నదమ్ముల మధ్య గొడవ ఎలా మొదలైంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. దీనికి ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు మనోజ్.
“నా పెళ్లి తర్వాత మా కుటుంబంలో కొంచెం గ్యాప్ వచ్చినా.. నా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నపుడు అందరం కలిశాం. కానీ అది మా కుటుంబంలో ఒకరికి నచ్చలేదు. మరోవైపు కాలేజీలోని కొన్ని సమస్యల గురించి పెద్దాయన వరకు వెళ్లడం లేదంటూ స్టూడెంట్స్ లెటర్లు రాసి నాకు ఇచ్చారు. అప్పుడు ‘నీకేంటి సంబంధం?’ అన్న మాట వచ్చింది. అక్కడ పని చేసే వాళ్లందరితో నా మీద, నా భార్య మీద కేసులు పెట్టించారు. సంబంధం లేని విషయంలోకి నా భార్యను లాగారు. అప్పుడు నా గుండె ముక్కలైంది. తనకు అన్నీ నేనే. నేను తప్పు చేయలేదు. ఒక్క కేసు కూడా పెట్టలేదు. గొడవ పెట్టుకోలేదు. నాకూ ఆవేశం ఉంది. బాధతో వచ్చిన కోపం అది. వెళ్లి నాన్న కాళ్ళు పట్టుకోవాలని.. నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఇప్పటికీ ఉంది. కానీ అలా చేస్తే నేను చేయని తప్పును అంగీకరించినట్లు అవుతుంది. అలా చేస్తే నా పిల్లలకు నేను ఏం నేర్పిస్తా. మా నాన్న నేర్పించిన నీతి అది. అందుకే ముందుకు వెళ్లలేకపోతున్నా. మేమంతా మళ్లీ కలిసి ఉండే రోజు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. సమస్యలు సృష్టించిన వారు తమ తప్పు తెలుసుకుంటారనే నమ్మకం ఉంది” అని మనోజ్ తెలిపాడు.