అసుర హననం అంచనాలు అందుకుందా

హరిహర వీరమల్లు నుంచి కీలక కంటెంట్ ఇవాళ విడుదలయ్యింది. అసుర హననం పాట గురించి పవన్ కళ్యాణ్ ఇటీవలే చాలా గొప్పగా చెప్పడంతో అభిమానుల ఈ సాంగ్ మీద ప్రత్యేకమైన అంచనాలు పెట్టుకున్నారు. ఆస్కార్ విజేత కీరవాణి స్వరపరిచిన ఈ పాట కోసం రాంబాబు గోసాల సాహిత్యం సమకూర్చగా ఐరా, కాల భైరవ, సాయిచరణ్, లోకేశ్వర్, మొహమ్మద్ గాత్రం అందించారు. పూర్తి ఎలివేషన్లతో కూడిన ఈ అసుర హననంలో మొఘలుల మీద తిరుగుబాటు ప్రకటించిన వీరమల్లు పరాక్రమం ఏ స్థాయిలో జనాన్ని ఉత్తేజితులను చేసిందో వచ్చే సందర్భంలో వాడుకున్నారు..

పౌరుషం తగ్గిందని అనిపించినప్పుడలా ఈ పాట వింటానని పవన్ కళ్యాణ్ చెప్పినట్టే కీరవాణి పవర్ ఫుల్ సౌండింగ్ తో కంపోజ్ చేశారు. ట్యూన్ పరంగా మొదటి నుంచి చివరిదాకా ఒకే టోన్, రిథమ్ లో తీసుకెళ్లి చివర్లో మాత్రం పతాక స్థాయికి చేర్చారు. అక్కడ చూపించిన పవన్ కళ్యాణ్ యుద్ధం తాలూకు విజువల్స్ అభిమానులను కనువిందు చేసేలా ఉన్నాయి. ఒక షాట్ లో బాబీ డియోల్ ని చూపించారు తప్పించి మిగిలిన ఆర్టిస్టులను రివీల్ చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకు ముందు వచ్చిన రెండు పాటలతో పోలిస్తే ఇది చాలా మెరుగ్గా అనిపించే మాట వాస్తవం. ఫ్యాన్స్ అదే ఫీలవుతున్న వైనం కనిపిస్తోంది.

జూన్ 12 విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు డేట్ లో ఎలాంటి మార్పులు ఉండబోవడం లేదు. చేతిలో ఇంకొక్క 22 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం ప్రమోషన్లు వేగవంతం చేశారు. ఇవాళ హైదరాబాద్ లో ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి జాతీయ స్థాయి మీడియాని తీసుకొచ్చి వివరాలు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు కర్ణాటకలో కుంకీ ఏనుగుల కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండటంతో ఇక్కడికి రాలేదు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున ప్లాన్ చేయబోతున్నారు. బూర్జ్ ఖలీఫాలో ట్రైలర్ లాంచ్ అంటున్నారు కానీ దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.