రెండు సింహాల మధ్య ‘వార్ 2’ యుద్ధం

జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ వార్ 2 టీజర్ ఇవాళ తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యింది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా వదలకుండా పబ్లిసిటి విషయంలో గుంభనంగా ఉన్న యష్ రాజ్ ఫిలింస్ ఈ రోజు నుంచి ప్రమోషన్లకు శ్రీకారం చుట్టింది. అయాన్ ముఖర్జి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ప్రీతమ్ సంగీతం సమకూరుస్తున్న వార్ 2 రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. కూలీతో పాటు ఆగస్ట్ 14 విడుదల కానుంది.

కథేంటో మొత్తం చెప్పలేదు కానీ క్లూస్ అయితే ఇచ్చారు. ఇండియాలోనే బెస్ట్ రా ఏజెంట్ గా పేరు పొందిన కబీర్ (హృతిక్ రోషన్) ని సవాల్ చేస్తూ ఒకడొస్తాడు (జూనియర్ ఎన్టీఆర్), ఇకపై నీకా పేరు లేకుండా చేస్తానని ఛాలెంజ్ విసిరి ప్రతిచోటా సై అంటే సై అంటూ సవాల్ విసురుతాడు. శత్రువును తక్కువంచనా వేసిన కబీర్ కు తానెంత పొరపాటు చేశాడో అర్థమవుతుంది. అక్కడి నుంచి ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇంతకీ కబీర్ ని కవ్వించిన మరో ఏజెంట్, అతనికి  ఎందుకా ఉద్దేశం కలిగింది, దేశం కోసం యుద్ధంలో చివరికి ఎవరిది పై చేయి అయ్యిందనేది తెరమీద చూడాలి.

ఎప్పటిలాగే యష్ రాజ్ విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. హాలీవుడ్ స్థాయిలో ఫైట్స్, ఛేజులు డిజైన్ చేసిన వైనం కనిపించింది. తారక్ ఇంట్రో, ట్రైన్ ఫ్లైట్ మీద పరస్పరం తలపడే ఎపిసోడ్, కత్తులతో దూసుకునే సన్నివేశం ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. అయాన్ ముఖర్జీ మేకింగ్ లో చాలా క్వాలిటీ కనిపిస్తోంది. టీజర్ లో బిల్డప్ హృతిక్ రోషన్ కే ఎక్కువగా పెట్టడం గమనార్హం. ఇదింకా టీజరే కాబట్టి కంటెంట్ గురించి అప్పుడే ఒక నిర్ధారణకు రాలేం కాబట్టి ట్రైలర్ దాకా వేచి చూడాలి. మొత్తానికి అభిమానులు అంచనాలకు మించి వార్ 2లో పెద్ద యుద్ధాన్నే చూడబోతున్నామనే నమ్మకమైతే ఇచ్చారు.