ఈ రోజుల్లో చిత్ర బృందాలు ఒరిజినల్ కలెక్షన్లను పోస్టర్ మీద వేయడం అన్నది చాలా చాలా అరుదు. పోస్టర్ల మీద కనిపించే ఫిగర్లను 20-30 శాతం తగ్గించుకుని లెక్కలు వేసుకుంటూ ఉంటారు అభిమానులు. కొన్ని సందర్భాల్లో 40-50 శాతం కలెక్షన్లను పెంచి పోస్టర్ల మీద వేస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఈ సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ సినిమాకు తొలి రోజు ప్రకటించిన వసూళ్ల లెక్కలపై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. మొత్తం థియేట్రికల్ రన్ అయ్యేసరికి కూడా అంత వసూళ్లు రాలేదనే విమర్శలు వచ్చాయి.
ఇంకా చాలా సినిమాల కలెక్షన్ల పోస్టర్ల మీద గొడవ జరిగింది. అభిమానుల కోసం కలెక్షన్లను పెంచి చూపిస్తామని స్వయంగా నిర్మాతలే ప్రకటిస్తున్నపుడు ఈ వసూళ్ల లెక్కలను ఎలా నమ్ముతారు ఎవరైనా? రోజు రోజుకూ ఈ విషయంలో క్రెడిబిలిటీ దెబ్బ తింటున్నా సరే.. నిర్మాతలు మారట్లేదు. తాజాగా తమిళ స్టార్ సూర్య కొత్త చిత్రం ‘రెట్రో’కు సంబంధించి అతడి సొంత నిర్మాణ సంస్థ ‘2డీ ఎంటర్టైన్మెంట్స్’ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.235 కోట్ల ఆదాయం రాబట్టినట్లు ప్రకటించేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ మెటీరియల్గా మారిపోయింది.
‘రెట్రో’ థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయింది. ఆ సినిమా వంద కోట్ల వసూళ్లు కూడా సాధించలేదన్నది ట్రేడ్ వర్గాల మాట. మరి రూ.235 కోట్లేంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఐతే పోస్టర్ మీద చిన్న అక్షరాల్లో నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చిన ఆదాయం కూడా కలిపితే ఈ నంబర్ అని డిస్క్లైమర్ వేశారు. కానీ పెద్ద అక్షరాల్లో కలెక్షన్ల ఫిగర్ వేసి.. షరతులు వర్తించును అన్నట్లుగా ఓ మూల చిన్న అక్షరాల్లో పెట్టడం ఏంటి అంటూ సూర్య అండ్ కోను విమర్శిస్తున్నారు నెటిజన్లు. నాన్ థియేట్రికల్ ఆదాయం కలిపినా కూడా ఈ సినిమా అంత ఆదాయం రాబట్టింది అనడం ఎగ్జాజరేషనే అని.. థియేట్రికల్ రన్ ముగిసిన దశలో ఇలాంటి పోస్టర్లు రిలీజ్ చేసి పరువు పోగొట్టుకోవడం తప్ప సాధించేదీ ఏమీ లేదని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

Gulte Telugu Telugu Political and Movie News Updates