ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో సన్ పిక్చర్స్ నిర్మించబోయే ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ వేసవిలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బన్నీ గెటప్ కు సంబంధించిన విఏఎక్స్ ఎలా ఉండాలనే దాని మీద విదేశీ నిపుణుల బృందంతో కలిసి వర్క్ షాప్ చేస్తున్న అట్లీ టీమ్ వాటి గురించిన మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతోంది. అయితే కొన్ని లీక్స్ వచ్చేస్తున్నాయి. వాటిలో ప్రధానమైంది అల్లు అర్జున్ ఇందులో ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడనేది టాక్.
ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒక పాత్ర పూర్తి యానిమేషన్ లో ఉంటుందట. మిగిలిన రెండింట్లో ఒకటి హీరో కాగా మరొకటి విలన్. ఇప్పటిదాకా ఇలాంటి ప్రయోగం ఏ ఇండియన్ హీరో చేయలేదు. చిన్న సీన్లు లేదా ఎపిసోడ్లలో కనిపించడం మాములే కానీ ఫుల్ లెన్త్ సినిమాలో చేసిన దాఖలాలు లేవు. ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ట్రీట్ మెంట్ డిఫరెంట్ గా ఉంటుందని, అవెంజర్స్, డ్యూన్ తరహాలో ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా అట్లీ రాసుకున్నారని సమాచారం. తెరకెక్కించడం కూడా అదే స్థాయిలో ఉండబోతోందట.
అల్లు అర్జున్ కెరీర్ లోనే తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా బడ్జెట్ పరంగా ఎలాంటి రాజీ ఉండబోవడం లేదని చెన్నై టాక్. ఇప్పటిదాకా తమిళ హీరోలు తప్ప బయటి వాళ్ళతో చేయని సన్ పిక్చర్స్ మొదటిసారి ఆ నియమాన్ని పక్కనపెట్టి బన్నీతో చేతులు కలిపింది. దానికి తగ్గట్టే టాలీవుడ్ మొదటి అడుగు బలంగా పడాలనే ఉద్దేశంతో ఎంత ఖర్చయినా పర్వాలేదనే రీతిలో అట్లీకి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 2026 చివరిలో విడుదల చేసేందుకు ప్రస్తుతానికి టార్గెట్ పెట్టుకున్నారు కానీ ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఆలస్యమైతే 2027 సంక్రాంతి లేదా వేసవి దాకా వెయిట్ చేయాలి. ఎదురుచూపులు పెద్దవే కానున్నాయి.