రీ రిలీజ్ ట్రెండ్ లో ఒకప్పటి వింటేజ్ సినిమాలను థియేటర్ లో అనుభూతి చెందాలనే ప్రేక్షకులు భారీగా ఉన్నారు. నిన్న జగదేకవీరుడు అతిలోకసుందరికి వచ్చిన భారీ స్పందన చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. సింగిల్ లాంటి కొత్త రిలీజులకు సైతం లేని నెంబర్లు కొన్ని సెంటర్లలో ఈ మెగా హిట్ నమోదు చేయడం చూసి ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు. అయితే ప్రింట్ క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేకపోవడం కొంత నిరాశ పరిచిన మాట వాస్తవం. రీళ్లు అందుబాటులో లేకపోవడం, దొరికినవి కూడా బాగా డ్యామేజ్ కావడం వల్ల నాణ్యత విషయంలో వైజయంతి మూవీస్ రాజీపడిన వైనం కనిపించింది.
ఇదే సమస్య గత నెల విడుదలైన ఆదిత్య 369 సైతం ఎదురుకుంది. కొన్ని భాగాలు దెబ్బ తినడం వల్ల కలర్స్ ని సరిగా రీ స్టోర్ చేయలేకపోయారు. ఈ రెండు సినిమాల రీళ్లు పాత డిస్ట్రిబ్యూటర్ దగ్గర దొరకడం గమనార్హం. గతంలో ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ ఇలాంటి ఫీడ్ బ్యాక్ తోనే స్పందన స్థాయి తగ్గించుకున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని క్లాసిక్స్ రీ రిలీజ్ కు సిద్ధం కాబోతున్నాయి. విశ్రాంతి తీసుకుంటున్న నిర్మాతలు తక్షణం రంగంలోకి దిగి ప్రింట్లను సమీకరించే పనిలో పడాలి. కాస్త ఖర్చు ఎక్కువైనా సరే మంచి క్వాలిటీతో ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు ఉన్న మార్గాలన్నీ తవ్వి తీయాలి.
ఇది ఒక రోజుతో ఆగేది కాదు. ఒక్కసారి 4కెని తయారు చేసుకుంటే దానికి శాశ్వతత్వం వచ్చేస్తుంది. మూవీ లవర్స్ నుంచి చాలా డిమాండ్స్ ఉన్నాయి. శివ, బొబ్బిలి రాజా, భైరవ ద్వీపం, హలో బ్రదర్, సాగర సంగమం, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్ పెక్టర్, చంటి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఎదురు చూస్తున్నారు. కొదమసింహం ప్రకటన ఆల్రెడీ వచ్చేసింది కూడా. ప్రింట్ల స్టాండర్డ్ ని పెంచాల్సిన అవసరం చాలా ఉంది. హాలీవుడ్, బాలీవుడ్ ఎలాంటి ప్రామాణికాలు పాటిస్తున్నాయో గమనించాలి. కొత్త సినిమాలకు ధీటుగా పాత క్లాసిక్స్ ఆదరణ దక్కించుకుంటున్న ట్రెండ్ లో జాగ్రత్తలు అవసరమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates