పెహల్గామ్ దుర్ఘటన తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో ఊహించడం కష్టంగా ఉంది. ఒకరకమైన యుద్ధ వాతావరణం ఇప్పటికే నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా అన్ని రాష్ట్రాలు సన్నద్ధంగా ఉండాలని, అందులో భాగంగా రేపు దేశమంతా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగే పక్షంలో ఎలా ఎదురుకోవాలనే దాని గురించి పోలీసులు, అధికారులు, పౌరులను ముందుగానే అప్రమత్తం చేయడం మాక్ డ్రిల్.
దీనికి ఇండస్ట్రీకి సంబంధం ఏమిటనుకోవచ్చు కానీ లింక్ ఉంది. ఒకవేళ నిజంగానే ఇండో పాక్ మధ్య వార్ లాంటిది వస్తే దాని ప్రభావం సామాన్య జనజీవనం మీద తీవ్రంగా ఉంటుంది. పబ్లిక్ బయటికి రావడానికి ఆలోచిస్తారు. వ్యవస్థ మొత్తం స్తంభించిపోదు కానీ జనాలు వినోదం మీద అంతగా దృష్టి పెట్టరు. పెద్ద ఎత్తున జరుగుతున్న దాడుల గురించి తెలుసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. అందులోనూ ఉత్తరాది రాష్ట్రాల మీద యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి థియేటర్ ఆక్యుపెన్సీలు రిస్క్ లో పడతాయి. ఇప్పుడేదో బాంబులు మిస్సైళ్లు పడతాయని కాదు కానీ శత్రువుల నుంచి ముప్పు ఏ రూపంలో అయినా ఉండొచ్చు.
ఇప్పటికిప్పుడు వార్ ముప్పు టాలీవుడ్ లేదా అన్ని వుడ్ ల మీద ఉంటుందా అంటే ఎంతో కొంత ఖచ్చితంగా లేకపోలేదు. కాకపోతే ఎంత మోతాదులో అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. అవి ప్రభుత్వాల చర్యల మీద ఆధారపడి ఉంటాయి. ఒకవేళ రద్దీలు ఎక్కువగా పోగయ్యే ప్రాంతాల మీద కఠిన ఆంక్షలు తీసుకొస్తే మటుకు ఫస్ట్ లిస్టులో థియేటర్లే ఉంటాయి. ఇదంతా ప్రస్తుతం ప్రాధమిక దశలో జరుగుతున్న చర్చలే కనక టెన్షన్ అక్కర్లేదు. ఒకవేళ ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి పాక్ పీచమణిచే చర్యలకు పూనుకుంటే మాత్రం సినిమాల కన్నా ఎక్కువ న్యూస్ ఛానల్స్ కు డిమాండ్ పెరిగిపోవడం ఖాయం. చూడాలి ఏం జరుగుతుందో.