ఆదిపురుష్… కొడుక్కి సారీ… స్పందించిన సైఫ్ అలీ ఖాన్

గత కొన్నేళ్లలో భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైన సినిమా అంటే ‘ఆదిపురుష్’ అనే చెప్పాలి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దీన్ని మించిన డిజాస్టర్లు చాలానే ఉన్నాయి కానీ.. ఇది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ‘రామాయణం’ కథను దారుణంగా చెడగొట్టి పెట్టారనే భావన రావడం వల్ల ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సామాన్య ప్రేక్షకుల సంగతి పక్కనపెడితే.. అనేక మంది సినీ ప్రముఖులే ఈ సినిమాను తప్పుబట్టారు. చిత్ర బృందంలోని వారు కూడా ఔట్ పుట్ విషయమై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి సైఫ్ అలీఖాన్ కూడా వచ్చాడు.

తన కొడుకు తైమూర్‌కు ‘ఆదిపురుష్’ సినిమా చూపించానని.. అతడిలో ఏ స్పందనలూ లేకపోవడం చూసి తాను సారీ చెప్పానని సైఫ్ పేర్కొనడం చర్చనీయాంశం అయింది.  ఆదిపురుష్ ఎంత డిజాస్టర్ అయినప్పటికీ.. తాను ముఖ్య పాత్ర పోషించిన సినిమా గురించి సైఫ్ ఇలాంటి కామెంట్ చేయడం ఆశ్చర్యపరిచింది. ఐతే ఈ కామెంట్లపై సైఫ్ ఇప్పుడు వివరణ ఇచ్చాడు.

ఆదిపురుష్ సినిమా బాలేదు కాబట్టి తన కొడుక్కి సారీ చెప్పలేదంటూ సైఫ్ యుటర్న్ తీసుకున్నాడు. తాను సారీ చెప్పింది వేరే విషయానికని వెల్లడించాడు. ‘‘నేను ఆదిపురుష్‌లో విలన్‌గా నటించాను. అందులో కేకలు వేస్తూ అందరిపై యుద్ధం చేస్తుంటాను. అది చూసి నా కొడుకు ఈసారి ఇలాంటి సినిమాలో హీరోగా చేయమని అడిగాడు. ఓకే చెప్పాను. ఇందులో విలన్‌గా చేసినందుకు సారీ చెప్పాను. నేను నటించిన అన్ని సినిమాలనూ గౌరవిస్తాను. ఆదిపురుష్‌ను కూడా అలాగే చూస్తాను. సినిమాలన్నింటికీ నా మద్దతు ఒకేలా ఉంటుంది’’ అని సైఫ్ పేర్కొన్నాడు. సైఫ్ ‘సారీ’ కామెంట్స్ తర్వాత నెటిజన్లు మరోసారి దర్శకుడు ఓం రౌత్‌ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సైఫ్ యుటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.