పౌరసన్మాన సభలో బాలయ్య జోరు హుషారు

కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా విచ్చేసిన అభిమానులు, నందమూరి కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య ఫ్యాన్స్, ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా బోలెడు కబుర్లు పంచుకున్నారు. ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా కొనసాగిన హీరో నేనొక్కడినేనంటూ కరతాళ ధ్వనుల మధ్య గర్వంగా చెప్పారు. పద్మభూషణ్ ఇచ్చారు సంతోషమే కానీ నాన్న ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇస్తే వాళ్లకు వాళ్ళు గౌరవం ఇచ్చుకున్నట్టు అవుతుందని విన్నవించారు.

ఇకపై సెకండ్ ఇన్నింగ్స్ ని మరింత బలంగా చూస్తారని, బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్లు ఇచ్చాక ఇకపై అంచనాలకు మించి మరింత చెలరేగుతానని ఒకవైపే చూడంటూ సింహాలోని డైలాగు చెప్పడం ద్వారా కొత్త జోష్ ఇచ్చారు. నటులందరూ ఎమ్మెల్యే కాలేదని, ఎందరో వచ్చి నామరూపాలు లేకుండా పోయారని, సేవలు చేశా కాబట్టి జనం నన్ను గెలిపించారని రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. ఇప్పుడే కాదు ఇక ముందు తరాలలో కూడా తన అభిమానులు పుడుతూనే ఉంటారని చెప్పిన బాలయ్య మైకు గాల్లో ఎగరేసి పట్టుకోవడం గురించి చమత్కరించడం, దానికి ఎంత టెన్షన్ పడుతుంటానో వివరించడం ఆకట్టుకుంది.

సినిమా, రాజకీయాలు రెండింటి ప్రస్తావన తెస్తూ మాట్లాడిన బాలకృష్ణ అంచనాలకు మించి మంచి కిక్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్న బాలయ్య ఆ సినిమా దసరా పండక్కు రిలీజ్ చేసే అవకాశాలు  తక్కువగా ఉన్నాయి కాబట్టి 2026 సంక్రాంతి వైపు చూస్తున్నారని ఆల్రెడీ టాక్ ఉంది. హీరో, ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్,  అన్ స్టాపబుల్ షో యాంకర్ ఇలా ఆరు పదుల వయసులోలోనూ బహుపాత్రలు పోషిస్తున్న బాలయ్యకు పద్మభూషణ్ తన ప్రతిభకు గవర్నమెంట్ ఇచ్చిన గౌరవం. ఇకపై మరింత దూకుడు చూపిస్తానంటున్న బాలయ్యని దర్శకుడిగా చూడాలనే ఫ్యాన్స్ కోరిక త్వరలోనే తీరొచ్చేమో.