గాయకుడి లైవ్ షోలో పెహల్గామ్ వివాదం

ఈ మధ్య కర్ణాటకలో కన్నడ భాష రాని వాళ్లకు ఎదురవుతున్న ఇబ్బందుల మీద సోషల్ మీడియాలో చాలా వీడియోలు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ భాష మీద వాళ్లకు అభిమానం ఉండటం న్యాయమే కానీ బెంగళూరు లాంటి గ్లోబల్ నగరాల్లో కేవలం ఈ కారణంగా సమస్యలు సృష్టించడం సబబు కాదు. తమిళనాడులోనూ ఈ తరహా ధోరణి ఉంది కానీ ఇంత తీవ్రంగా కాదు. ఇప్పుడీ సెగలు సీనియర్ గాయకుడు సోను నిగమ్ కు తగిలాయి. పేరుకి బాలీవుడ్ సింగరే కానీ తెలుగులోనూ చాలా పాటలు పాడారు. ఉల్లాసంగా ఉత్సాహంగా, చింతకాయల రవి, జీన్స్, వరుడు, సదా మీ సేవలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

తాజాగా సోను నిగమ్ బెంగళూరులో ఒక లైవ్ కన్సర్ట్ చేశారు. ఈవెంట్ జరుగుతూ ఉండగా ఒక టీనేజ్ కుర్రాడు పదే పదే కన్నడలో పాడమంటూ ఒత్తిడి చేయడమే కాక ప్ల కార్డులు ప్రదర్శించాడు. దీంతో సహనం కోల్పోయిన సోను నిగమ్ పాడటం ఆపేసి పెహల్గామ్ లాంటి దుర్ఘటనలు జరగడానికి కారణం ఇదేనంటూ విచిత్రమైన భాష్యం చెప్పారు. అసలు రెండింటికి సంబంధం ఏముందో అర్థం కాకపోయినా ఇలాంటి విభేదాలే ఉగ్రవాద దాడులకు దారి తీశాయని ఆయన ఉద్దేశం. కామెంట్ చేస్తున్న అబ్బాయి పుట్టకముందే కన్నడలో చాలా పాటలు పాడానని, జీవితంలో బెస్ట్ సాంగ్స్ ఇదే భాషలో ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఇదంతా బాగానే ఉంది అసలు ప్రతిదానికి పెహల్గామ్ కు ముడిపెట్టడం సెలబ్రిటీలకు సరికాదు. సోను నిగమ్ కామెంట్స్ పట్ల మద్దతు, విమర్శలు రెండూ వినిపిస్తున్నాయి. అయినా వేరే ఇండస్ట్రీ నుంచి ఒక గాయకుడు వచ్చి షో చేస్తున్నప్పుడు కన్నడవే ఎక్కువ పాడాలని ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే హాజరైన అభిమానుల్లో తెలుగు, హిందీ, తమిళ ఇలా అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు. రెహమాన్, ఇళయరాజా, దేవిశ్రీ ప్రసాద్ ఇలా ఎవరిని తీసుకున్నా ఒకే భాషకు కట్టుబడరు. అన్ని పాటలు పాడి అలరిస్తారు. కాకపోతే సోను నిగమ్ కు వీళ్ళెవ్వరికి రాని చిక్కు పడింది. అసలు పెహల్గామ్ ప్రస్తావన తేకపోయి ఉంటే బాగుండేది.