గుంటూరు కారం తర్వాత గ్యాప్ వచ్చేసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన హ్యాట్రిక్ హీరో అల్లు అర్జున్ తో ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే స్క్రిప్ట్ రూపకల్పనతో పాటు ఇతరత్రా ప్రీ ప్రొడక్షన్ పనులు కొంత ఆలస్యం కావడంతో బన్నీ తమిళ దర్శకుడు అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రెండూ సమాంతరంగా చేయాలనే ఆలోచన ఉంది కానీ ఎంతవరకు సాధ్యమవుతోందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. త్రివిక్రమ్ మాత్రం ముందు అట్లీది పూర్తయ్యాకే తమ సినిమా చేద్దామని అన్నారట. కాకపోతే ఎంతలేదన్నా ఏడాదికి పైగానే గ్యాప్ వస్తుంది. మరి అప్పటిదాకా ఖాళీగా ఉండటం కష్టం కదా.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం వెంకటేష్ తో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న చిత్రాన్ని ఇప్పుడు చేసే దిశగా త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నారట. నిజానికీ ఈ కాంబోలో సితారే ఎంటర్ టైన్మెంట్స్ 2017లో అధికారిక ప్రకటన ఇచ్చింది. తర్వాత పక్కకు వెళ్ళిపోయింది. కారణాలు అనేకం. నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి లాంటి బ్లాక్ బస్టర్లకు అద్భుతమైన డైలాగులిచ్చిన త్రివిక్రమ్ డైరెక్షన్ లో తమ హీరోని చూడాలని వెంకీ అభిమానుల డిమాండ్. వాసు లాంటి ఫ్లాప్ లోనూ మాటల మాంత్రికుడి మేజిక్ ఒక్కటే చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ కలయికని సాధ్యమయ్యేలా చూడమని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
ఫైనల్ బాల్ త్రివిక్రమ్ కోర్టులో ఉంది. ఆయన ఎస్ అంటే ప్రకటన వస్తుంది. లేదంటే పెండింగ్ ఉండిపోతుంది. మొదటిదే జరగొచ్చని ఫిలిం నగర్ టాక్. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీలో ఉన్నారనే ప్రచారం జోరుగా ఉంది కానీ టీమ్ సమర్ధించడం, ఖండించడం చేయలేదు. సో ఈజీగా తీసిపారేసే పుకారు కాదు. అల్లు అర్జున్ తో మైథలాజికల్ ఫాంటసీ డ్రామాని ప్లాన్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అన్నట్టు వెంకీ – నాని కలయికలో మల్టీస్టారర్ మిస్సయ్యింది కదా. ఇప్పుడు దాన్నే తీస్తే అదిరిపోతుందిగా.