సెలబ్రిటీ షోల మీద పెహల్గామ్ ప్రభావం

తలుచుకుంటే చాలు మనసంతా బాధతో నిండిపోయే పెహల్గామ్ దుర్ఘటన తాలూకు విషాదం ఇప్పుడప్పుడే మనల్ని వీడిపోయేలా లేదు. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు నివాళిగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు జనం నుంచి మంచి మద్దతుని తీసుకొస్తున్నాయి. దీని ప్రభావం సెలబ్రిటీల షోల మీద తీవ్రంగా పడుతోంది. యుకెలో మే 4 మరియు 5 తేదీల్లో భారీ లైవ్ కన్సర్ట్ ఒకటి ప్లాన్ చేశారు. టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి. సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్, వరుణ్ ధావన్, దిశా పటాని, టైగర్ శ్రోఫ్, కృతి సనన్, సారా అలీ ఖాన్ లాంటి క్రేజీ స్టార్లు ఇందులో పాల్గొంటారని పబ్లిసిటీ చేశారు. లండన్ వేదికగా ఏర్పాట్లు జరిగాయి.

ఒకపక్క పెహల్గామ్ ఉదంతం దేశాన్ని కుదిపేస్తున్న టైంలో వేరే చోట డాన్సులు చేస్తూ, పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయడం సబబు కాదని భావించిన నిర్వాహకులు షోని వాయిదా వేశారు. ఎప్పుడు కొత్త డేట్ అనేది ప్రకటించలేదు కానీ ప్రస్తుతానికి టికెట్లు కొన్న ఆడియన్స్ డబ్బులు వెనక్కు పంపిస్తున్నారు. ఇది మంచి నిర్ణయం. గాయని శ్రేయ ఘోషల్ సైతం తన లైవ్ ప్రోగ్రాంని రద్దు చేసుకోవడం చూశాం. అనిరుధ్ రవిచందర్ తలపెట్టిన హుకుమ్ కార్యక్రమం తాలూకు టికెట్ల అమ్మకాలు పోస్ట్ పోన్ చేశారు. ఆర్జిత్ సింగ్ కూడా ఇదే బాట పట్టారు. ఈ రెండు నెలల్లో తలపెట్టిన ఇలాంటి షోలు క్యాన్సిలయ్యే దిశగా వెళ్తున్నాయి.

బాధితులకు అండగా ఉండాల్సిన ఇలాంటి సమయంలో సంబరాలకు దూరంగా ఉండటం అత్యవసరం. ప్రజల్లో కోపం ఇంకా చల్లారలేదు. సినిమాలు, షోలను ఆస్వాదించే మూడ్ లో పెద్దగా లేరు. అయితే ఈ వాయిదాలు ఎంత కాలం ఉండొచ్చనేది  చెప్పలేం. పాకిస్థాన్ మీద చేపట్టిన చర్యల్లో ఏదో ఒకటి ప్రత్యక్ష ఫలితాన్ని ఇచ్చాక పబ్లిక్ లో ఆగ్రహావేశాలు కొంత మేరకు చల్లారి అప్పుడు సాధారణ వాతావరణం నెలకొనడానికి అవకాశం ఉంటుంది. థియేటర్లలో జనాలు పెద్దగా కనిపించకపోవడానికి కారణం ఇదేనని చెప్పలేం కానీ సోషల్ మీడియాలో పెహల్గామ్ గురించిన చర్చలే ఎక్కువగా జరుగుతూ ఉంటే ఎంటర్ టైన్మెంట్ కు చోటేది.