మల్లువుడ్ ఇటీవలి కాలంలో మాదకద్రవ్యాల ఉచ్చులో చిక్కుకుంటోంది. నటుడు షైన్ టామ్ చాకో ఉదంతం ఎంత రచ్చ చేసిందో చూసాం. తాజాగా అలిపుజ జింఖానాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ఖాలిద్ రెహమాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం సంచలనం రేపుతోంది. నిన్న రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఇతనితో పాటు మరో డైరెక్టర్ అష్రాఫ్ హంజా, షలీఫ్ మొహమ్మద్ అనే మరో వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కోచి నగరంలో సమీర్ తాహీర్ అనే సినిమాటోగ్రాఫర్ కు చెందిన గోస్రీ బ్రిడ్జ్ దగ్గరలోని ఒక ఫ్లాట్ మీద దాడి చేసినప్పుడు 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయి దొరకడంతో కేసు నమోదయ్యింది.
అక్కడి మీడియా రిపోర్ట్స్ ప్రకారం ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు సమాచారం. కాకపోతే అభియోగం చాలా తీవ్రమైనది కావడంతో అంత సులభంగా ఈ కేసు నుండి బయటికి రాలేరు. ఎవరో ఆగంతకుడు ఇచ్చిన సమాచారం మేరకు పక్కా ప్లానింగ్ తో పోలీసులు నిర్వహించిన రైడ్ లో గాంజా దొరకడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మలయాళ పరిశ్రమలో డ్రగ్స్ ఎంత విచ్చలవిడిగా వాడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే విన్సీ అనే నటి చేసిన ఆరోపణల్లో షైన్ చామ్ టాకో క్షమాపణ దాకా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి అసోసియేషన్ అతని ప్రవర్తనకు చివరి వార్నింగ్ ఇచ్చింది. రిపీట్ అయితే నిషేధం విధించవచ్చు.
తాళుమాల, అలిపుజ జింఖానా లాంటి బ్లాక్ బస్టర్స్ తో మంచి కెరీర్ ఏర్పడుతున్న టైంలో ఖలీద్ రెహమాన్ ఇలాంటి డ్రగ్స్ ఉచ్చులో పడటం ఆలోచించాల్సిన విషయం. మాదకద్రవ్యాలు ఎంత ప్రమాదమో సినిమాల్లో చెబుతూ ఇంకోవైపు దాన్ని వాళ్లే పాటించకపోతే ఎలానే కామెంట్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవలే జరిగిన ఈ సంఘటనలు మల్లువుడ్ కు మచ్చ తెస్తున్నాయని పెద్దలు వాపోతున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్, ప్రియదర్శన్, ఫాజిల్ లాంటి లెజెండ్స్ వందల సినిమాలు చేసినా ఏనాడూ కాంట్రావర్సీలు చేయలేదు. కానీ రెండు మూడు సినిమాలకే ఇప్పటి ఫిలిం మేకర్స్ పెడత్రోవ పట్టడం విచారకరం.