నాగచైతన్య 24 కోసం ఏం తవ్వబోతున్నారు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి బ్లాక్ బస్టర్ అవసరమైన టైంలో దాన్ని విరూపాక్ష రూపంలో ఇచ్చి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కార్తీక్ దండు ఇప్పుడో మిస్టిక్ థ్రిల్లర్ తో రెడీ అవుతున్నాడు. ఇటీవలే తండేల్ సూపర్ హిట్ తో విజయాల దారిలో పడ్డ నాగ చైతన్యతో చేతులు కలిపాడు. నిజానికీ ప్రాజెక్టు లాకై నెలలు గడిచిపోయాయి. కానీ ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటయించడంతో పాటు అంత టైం ఎందుకు పట్టిందో అర్థమయ్యేలా అనౌన్స్ మెంట్ వీడియోని ఇవాళ రిలీజ్ చేశారు. ఎస్విసిసి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంయుక్త భాగస్వాములు.

ఒక అంతుచిక్కని రహస్యాన్ని ఛేదించే యువకుడి పాత్రలో నాగచైతన్య చాలా ఇంటెన్స్ గా కనిపించబోతున్నాడు. స్టోరీకి సంబంధించిన క్లూస్ ఇవ్వలేదు కానీ వీడియోని నిశితంగా గమనిస్తే ఎత్తయిన కొండలు, లోయలు, జలపాతాలు, దట్టమైన అడవులు, అంతు చిక్కని నిర్మాణాలు, పురాతన భావనాలు ఇలా పెద్ద సెటప్పు సెట్ చేశారు. విరూపాక్షతో టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న అజనీష్ లోకనాథ్ దీనికి సంగీతం సమకూర్చడం విశేషం. క్యాస్టింగ్ ఇతరత్రా వివరాలు ఇంకా బయట పెట్టలేదు కానీ వృషకర్మ అనే టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీమ్ దాని గురించి అధికారికంగా చెప్పడం లేదు.

ఏదైతేనేం ప్రయోగాల జోలికి వెళ్లి కస్టడీ, లాల్ సింగ్ చద్దా, థాంక్ యు లాంటి డిజాస్టర్లు చూసిన చైతు ఇప్పుడు సరైన దారిలో వెళ్తున్నాడు. ట్రెండ్ గా మారిన థ్రిల్లర్స్ ని ఎంచుకోవడం మంచి ఎత్తుగడ. వచ్చే ఏడాది విడుదలని ప్లాన్ చేసుకుంటున్న ఈ ఎన్సి 24కి పెద్ద బడ్జెట్ కేటాయించబోతున్నారు. సుకుమార్ సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి కంటెంట్ పరంగా నమ్మకంగా ఉండొచ్చు. ఇటీవలే జాక్ తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన బివిఎస్ఎన్ ప్రసాద్ ఈసారి మరింత గ్రాండ్ స్కేల్ తో దీన్ని తెరకెక్కించబోతున్నారు. చైతు సైతం ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద ధీమాగా కనిపిస్తున్నాడు.