శతాబ్దాలుగా గొప్ప ఇతిహాసంగా నిలిచిపోయిన మహాభారత గాథ మీద ఎన్ని వందల వేల పుస్తకాలు, సినిమాలు, సీరియళ్లు వచ్చాయో లెక్క చెప్పడం కష్టం. ముఖ్యంగా టాలీవుడ్ లోనే ఎందరో స్టార్లు ఈ కథను వాడుకుని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, పాండవ వనవాసం, నర్తనశాల, శ్రీ కృష్ణ పాండవీయం, శ్రీ మద్విరాట పర్వం చెప్పుకుంటూ పోతే ఎన్నో క్లాసిక్స్ చరిత్రలో నిలిచిపోయాయి. కృష్ణ కురుక్షేత్రం, బాలకృష్ణ శ్రీ కృషార్జున విజయం, శోభన్ బాబు వీరాభిమన్యు ఇలా ఇతర హీరోల నుంచి సైతం మరపురాని ఆణిముత్యాలు చాలానే వచ్చాయి. బాలీవుడ్ లోనూ ఉన్నాయి కానీ ఇన్నేసి అయితే కాదు.
అందుకే దర్శకధీర రాజమౌళికి ఎప్పటికైనా మహాభారతాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనే కోరిక ఉండేది. బాహుబలి టైంలో పలు ఇంటర్వ్యూలలో ఆ కోరికను వ్యక్తం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ని కర్ణ సుయోధనుడిగా చూడాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. అయితే కార్యరూపం దాల్చలేదు. కన్నడలో ఆ మధ్య దర్శన్ తో కురుక్షేత్రని త్రీడి తీయడం ప్రేక్షకులకు గుర్తే. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అమీర్ ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో స్క్రిప్ట్ పనులు మొదలుపెడతామని, తానే ప్రొడ్యూసర్ గా భారీ ఎత్తున నిర్మిస్తానని ఒక ఆంగ్ల ఇంటర్వ్యూలో చెప్పాడు.
వివిధ భాగాలుగా వేర్వేరు దర్శకులతో తీస్తానని స్పష్టం చేశాడు. అయితే ఇంత రిస్క్ కి అమీర్ ఖాన్ సిద్ధ పడ్డాడంటే ప్లానింగ్ ఏదో పెద్దగా ఉన్నట్టుంది. సితారే జమీన్ పర్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా పంచుకున్న కబుర్లలో అమీర్ ఈ విశేషాన్ని చెప్పుకొచ్చాడు. ఇంతకు ముందు ఇలాగే అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతలు, మోహన్ లాల్ లాంటి స్టార్లు మహాభారతాన్ని తీయాలని ప్లాన్ చేసుకుని తర్వాత రకరకాల కారణాలతో ఆగిపోయారు. అమీర్ ఖాన్ కూడా వీళ్ళ బాటలోనే వెళ్తాడా లేక చెప్పిన మాట ప్రకారం తీసి చూపిస్తాడా అనేది వేచి చూడాలి. నిజమైతే మాత్రం క్యాస్టింగ్ అతి పెద్ద సవాల్ కానుంది.