90వ దశకంలో తెలుగు సినీ ప్రియులను ఒక ఊపు ఊపిన కథానాయికల్లో రంభ ఒకరు. అసలు పేరు విజయలక్ష్మి అయినప్పటికీ ఈ విజయవాడ అమ్మాయి స్క్రీన్ నేమ్ను రంభగా మార్చుకుని తొలి చిత్రం ఆ ఒక్కటి అడక్కుతోనే అప్పటి యువత గుండెల్లో గుబులు రేపింది. ఆపై బావగారు బాగున్నారా సహా ఎన్నో పెద్ద సినిమాల్లో నటించి ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది. తమిళంలో సైతం పలు చిత్రాల్లో నటించిన రంభ.. పదేళ్లకు పైగా కెరీర్ తర్వాత సినిమాలకు టాటా చెప్పేసింది. చివరగా దేశముదురులో ఐటెం సాంగ్లో కనిపించిన రంభ.. ఆపై పెళ్లి చేసుకుని ఫారిన్కు వెళ్లిపోయి వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయింది.
ఐతే చాలామంది ముందు తరం హీరోయిన్ల లాగే ఆమె కూడా సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాలనుకుంటోంది. అక్క, వదిన, తల్లి తరహా పాత్రలు చేయడానికి రంభ రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే ఒక టీవీ షోకు జడ్జిగా కూడా వచ్చింది రంభ. త్వరలోనే రంభ తన రీఎంట్రీ సినిమా గురించి ప్రకటించబోతోంది. ఈ నేపథ్యంలో తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి రంభ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ”పెళ్లి తర్వాత నేను కెనడాలో స్థిరపడ్డాను. కుటుంబం, పిల్లల కోసమే సినిమాలకు దూరమయ్యాను. నా పిల్లలకు ఒక వయసు వచ్చే వరకు తల్లిగా బాధ్యత తీసుకున్నాను.
ఇప్పుడు మా బాబుకు ఆరేళ్లు. అమ్మాయిలకు 14, 10 ఏళ్లు. ప్రస్తుతం ఎవరి పనులు వాళ్లు చేసుకోగలుగుతున్నారు. నా మీద పూర్తిగా ఆధారపడట్లేదు. వాళ్లను చూసుకోవడం కోసమే ఇంతకాలం సినిమాలకు దూరమయ్యాను. నాకు సినిమాల మీద ఉన్న ఆసక్తి గురించి నా భర్తకు తెలుసు. అందుకే మళ్లీ నటిస్తానంటే ఒప్పుకున్నారు. ముందుగా ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా చేశాను. అప్పుడు చాలా భయపడ్డాను. కానీ షో సాఫీగా సాగిపోయింది. ప్రేక్షకుల చప్పట్లు నాలో మళ్లీ ఉత్సాహం నింపాయి. నటన నా రక్తంలోనే ఉంది. మళ్లీ నటించడానికి రెడీగా ఉన్నాను. నాతో కలిసి నటించిన చాలామంది ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు. నా ముందున్న అవకాశాలను పరిశీలిస్తున్నా. త్వరలోనే నేను నటించే సినిమాను ప్రకటిస్తాను” అని రంభ తెలిపింది.