సమంత కెరీర్లో ఎన్నో సినిమాలు చేసింది కానీ.. ‘ఏమాయ చేసావె’ తన అభిమానులకు చాలా ప్రత్యేకం. దాని కంటే ముందు తమిళంలో ఓ సినిమా చేసినా సరే.. ‘ఏమాయ చేసావె’లో ఆమె రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా క్లాసిక్గా నిలిచిపోవడంలో సమంత పాత్ర కీలకం. హీరోయిన్ని అంత అందంగా, అపురూపంగా చూపించిన చిత్రాలు అరుదని చెప్పొచ్చు. నాగచైతన్యతో సామ్ కెమిస్ట్రీ అద్భుతంగా పండి తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చింది. సమంతకు సంబంధించి ఆ సినిమాలో ప్రతిదీ స్పెషలే. కానీ సామ్కు మాత్రం ఇప్పుడు ఆ సినిమాను చూస్తే సిగ్గుగా అనిపిస్తుందట.
అందులో బాగా నటించలేదనే ఫీలింగ్ కలుగుతుందట. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘శుభం’కు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘నటిగా నేను కెరీర్ మొదలుపెట్టినపుడు నటన గురించి నాకు పెద్దగా తెలియదు. నేను నటించిన తొలి రెండు చిత్రాలను చూసుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఏమాయ చేసావెలో కూడా దారుణంగా నటించాననే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా బాగా నటించాల్సింది కదా అనిపిస్తుంది.
కానీ నేను ప్రొడ్యూస్ చేసిన ‘శుభం’ సినిమాలో చేసిన నటులు అలా కాదు. తొలి సినిమానే అయినా అందరూ చాలా బాగా నటించారు. అందరూ కొత్త వాళ్లే అయినా తడబడకుండా యాక్ట్ చేశారు. వారి పెర్ఫామెన్స్ నన్నెంతగానో ఆకట్టుకుంది’’ అని సామ్ చెప్పింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కంటెంట్కు పెద్ద పీట వేస్తారని.. మనసుకు హత్తుకునే కంటెంట్తో తెరకెక్కిన ‘శుభం’ చిత్రాన్ని వాళ్లు ఆదరిస్తారని సమంత ఆశాభావం వ్యక్తం చేసింది. నిర్మాతగా మారడంపై స్పందిస్తూ తనకు సవాళ్లను స్వీకరించడం ఇష్టమని సమంత పేర్కొంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.