కమల్ హాసన్, మణిరత్నంలది లెజెండరీ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన నాయగన్.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఐతే అలాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అందించిన ఈ జోడీ.. ఆ తర్వాత 36-37 ఏళ్ల పాటు సినిమా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఎట్టకేలకు ఇప్పుడు ఈ డ్రీమ్ కాంబినేషన్లో థగ్ లైఫ్ అనే సినిమా రాబోతోంది. గత ఏడాదే ఈ చిత్రం పట్టాలెక్కింది. జూన్లో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి తొలి పాటను తాజాగా లాంచ్ చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో విలేకరుల నుంచి ఎదురైన ఆసక్తికర ప్రశ్నలకు కమల్, మణిరత్నం జోడీ సమాధానాలు ఇచ్చింది.
నాయగన్ లాంటి కల్ట్ మూవీ తర్వాతి ఇన్నేళ్ల పాటు కమల్తో సినిమా ఎందుకు చేయలేకపోయారు అని ఓ విలేకరి మణిరత్నంను అడిగితే.. ఆయన నన్ను పిలవలేదు అంటూ సింపుల్ ఆన్సర్ ఇచ్చి నవ్వేశారు మణిరత్నం. ఐతే ఇంతలో మైక్ అందుకున్న కమల్ హాసన్.. తాము కలిసి పని చేయడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు.
మణిరత్నం కొన్నేళ్ల ముందు ఒక సినిమా ప్రతిపాదన చేశారని.. తన సొంత నిర్మాణ సంస్థలో ఆ సినిమా చేయడానికి కథను కూడా కొన్నామని.. కానీ ఆ సినిమాకు అయ్యే బడ్జెట్ కోసం ప్రణాళికలు వేయగా.. చివరగా తేలిన అంకె చూసి బెంబేలెత్తిపోయామని.. ఇది వర్కవుట్ కాదని భావించి తాము వెనక్కి తప్పుకున్నామని కమల్ తెలిపారు. ఈ విషయమంతా చెప్పి.. చివర్లో ఆ సినిమా పేరేంటో వెల్లడించారు. ఆ చిత్రమే.. పొన్నియన్ సెల్వన్ అట. తమిళ సినీ చరిత్రలోనే అత్యధికంగా రెండు భాగాలకు కలిపి పొన్నియన్ సెల్వన్ బడ్జెట్ రూ.600 కోట్లకు పైగానే అయింది. కమల్ వెనక్కి తగ్గాక లైకా ప్రొడక్షన్స్లో ఆ సినిమా చేశారు మణిరత్నం. ఫస్ట్ పార్ట్ మంచి ఫలితమే అందుకున్నప్పటికీ పార్ట్-2 మాత్రం నిరాశపరిచింది. ఓవరాల్గా పెట్టిన బడ్జెట్ను అటు ఇటుగా రాబట్టిందా సినిమా.