మిరాయ్ ముందుచూపు ఎంత పనికొచ్చిందో

చిరంజీవి లాంటి మెగాస్టార్ ఉన్నా విశ్వంభరకు ఆశించినంత బజ్ రావడం లేదు. టీజర్ కు నెగటివ్ రెస్పాన్స్ వస్తే మొదటి పాటకు ఆశించిన స్పందన కనిపించలేదు. ఇప్పటికే రిలీజ్ డేట్ వాయిదా పడుతూ ఫైనల్ గా ఎప్పుడు వస్తుందనేది అధికారికంగా ప్రకటించలేదు. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ నటించిన  రాజా సాబ్ అప్డేట్స్ ఎంత ఎదురు చూస్తే అంత ఆలస్యమవుతున్నాయి. విడుదల తేదీ విషయంలో విశ్వంభర సమస్యే దీనికీ ఉంది. అయితే వీటికి సాధ్యం కానీ ప్లానింగ్ తేజ సజ్జ లాంటి అప్ కమింగ్ హీరో మూవీకి జరుగుతోందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

సైలెంట్ కిల్లర్ లాగా మిరాయ్ పనులు జరిగిపోతున్నాయని ఇన్ సైడ్ టాక్. రాజా సాబ్ నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే దీన్ని నిర్మిస్తున్నప్పటికీ ప్రొడక్షన్ పరంగా మిరాయ్ వేగంగా ఉందని సమాచారం. ఆగష్టు 1 విడుదల తేదీని ఎప్పుడో ప్రకటించారు. దానికి అనుగుణంగానే షూటింగ్ పూర్తయిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ జరిగిపోతోంది. షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం వాయిదాలు కూడా అయిపోతున్నాయి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎక్కడా ఎలాంటి జాప్యం రాకుండా ప్లానింగ్ చేసుకున్న వైనం మంచి ఫలితం ఇస్తోందని అంటున్నారు. టీజర్ లో విఎఫెక్స్ చాలా బాగా వచ్చిందని లీక్స్ చెబుతున్న మాట.

అయితే ఆగస్ట్ రెండో వారంలోనే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2, రజనీకాంత్ కూలి, ఉపేంద్ర 45 రిలీజవుతున్న నేపథ్యంలో మిరాయ్ ఆగస్ట్ 1కి వస్తుందా అనే అనుమానాలు డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో లేకపోలేదు. అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా వెనుకడుగు వేసే సూచనలున్నాయి కాబట్టి ఆ ధీమాతోనే మిరాయ్ తన డేట్ కే కట్టుబడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్యాన్ ఇండియా సినిమాల విషయంలో జరుగుతున్న పరిణామాలు గమనించే మిరాయ్ ఒక అడుగు ముందుండే పనిలో ఉంది. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాలో దగ్గుబాటి రానా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బడ్జెట్ వంద కోట్లు దాటేసిందని టాక్.