సోషల్ మీడియా బుడగ పేల్చిన పూజా హెగ్డే

సోషల్ మీడియా ప్రపంచంలో కోట్లాది మంది మునిగి తేలుతూ ఉంటారు. సీరియస్ గా కెరీర్ కోసం వాడుకునే వాళ్ళు కొందరైతే పనీపాటా లేక ఫ్యాన్ వార్స్ కోసం అకౌంట్లు పెట్టుకునే వాళ్ళు బోలెడు. అందుకే అక్కడ కనిపించేదంతా నిజం కాదు. వందలు వేలు ఫాలోయర్లను చూసి మురిసిపోయి తామేదో సాధించామని జబ్బలు చరుచుకుంటే అంతకన్నా కామెడీ మరొకటి ఉండదు. కాకపోతే తమ సినిమా ప్రమోషన్ల కోసం ఎక్స్, ఇన్స్ టా, ఫేస్ బుక్ లాంటి మాధ్యమాలను వాడుకోవడం సెలబ్రిటీలకు తప్పడం లేదు. ఇక్కడ కూడా తమ హీరోకు ఎక్కువ అనుచరులు ఉన్నారంటూ నెంబర్లను చూపించి ట్రోల్ చేసే వాళ్ళు లేకపోలేదు.

హీరోయిన్ పూజా హెగ్డే అలాంటి వాళ్లకు పేలిపోయే కౌంటర్ ఒకటి వేసింది. తనకు సుమారు ఒక 30 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే వాళ్లంతా తన సినిమా కోసం థియేటర్లకు రారని, అదే కొందరు సూపర్ స్టార్లకు 5 మిలియన్ ఫాలోయర్స్ కూడా ఉండరని, కానీ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూళ్లు రాబడతారని చెప్పింది. రెండు వేర్వేరు ప్రపంచాలని, ఒకదాని ప్రభావం మరొక దాని మీద ఉంటుందనుకోవడం రైట్ కాదని తేల్చి చెప్పింది. ఇంత స్పష్టంగా అంకెతో సహా లాజిక్ వివరిస్తే ఇంకేం ఆన్సర్ ఉంటుంది. నెంబర్ల గారడీలో ఉండే నటీనటులు, అభిమానులు ఆలోచించే విషయమే ఇది.

మే 1 విడుదల కాబోతున్న రెట్రో ప్రమోషన్లలో భాగంగా పూజా హెగ్డే మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పుకొచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో తనకు భార్యగా చాలా పద్ధతైన పాత్ర దక్కింది. ఎక్కువ డైలాగులు లేకుండా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసేలా కథకు కీలక మలుపు ఇచ్చే దిశగా దర్శకుడు డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. పదిహేను నిమిషాల పాటు సింగల్ టేక్ ఎపిసోడ్ లో పాల్గొన్నానని చెబుతున్న పూజా హెగ్డే అది థియేటర్ లో మంచి అనుభూతి ఇస్తుందని చెబుతోంది. మూడేళ్లకు పైగా అందని ద్రాక్షగా మిగిలిపోయిన సక్సెస్ రెట్రోతో దక్కుతుందేమో చూడాలి.