ఫ్యాన్ మూమెంట్ : అన్న కాలర్ ఎగరేసిన తమ్ముడు

హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ అభిమానులతో కళకళలాడిపోయింది. ఇదే నెలలో అతి తక్కువ గ్యాప్ లో మ్యాడ్ స్క్వేర్ వేడుకలో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి పబ్లిక్ స్టేజి మీద గెస్టుగా రావడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. అందులోనూ నందమూరి అన్నదమ్ముల కలయిక అయితే ఆగగలరా. పరిమితికి మించి జన సందోహం వచ్చినప్పటికీ దేవర తరహా పరిస్థితులు పునరావృత్తం కాకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఇక యంగ్ టైగర్ పంచుకున్న కబుర్లు వచ్చినవాళ్ళకు మంచి జోష్ ఇచ్చాయి.

ఇక తారక్ మాటల్లో ప్రధాన విషయాలకు వస్తే అర్జున్ సన్నాఫ్ వైజయంతిని తాను చూశానని, టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పని చేశారని, విజయశాంతి నుంచి ప్రదీప్ చిలుకూరి వరకు ఏ ఒక్కరు లేకపోయినా సినిమా ఇంత బాగా వచ్చేది కాదని, గర్వంగా కాలర్ ఎగరేయమని అన్నయ్యని పిలిచి మరీ తమ్ముడు అది చేయించడంతో ఆడిటోరియం చప్పట్లతో హోరెత్తిపోయింది. నాన్న హరికృష్ణ లేని లోటు ఈ రోజు విజయశాంతి గారి వల్ల ఆవిడ మాటల వల్ల తెలియలేదని, తండ్రి ఆత్మ ఇక్కడే ఉండి ఇదంతా చూస్తూ ఉంటారని కొంత భావోద్వేగానికి  గురవ్వడం అభిమానులును కదిలించింది.

మొత్తానికి తన మాటల్లోని కాన్ఫిడెన్స్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా మీద అంచనాలు అమాంతం పెంచేశాడు. ఇదొక్కటే కాదు వార్ 2 ఆగస్ట్ 14 వస్తుందని మరోసారి కన్ఫర్మ్ చేసిన జూనియర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ అంతకు మించి ఉంటుందని ఊరించేశాడు. ఇటీవలి కాలంలో మంచి జోష్ తో కనిపిస్తున్న తారక్ వరస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఏప్రిల్ 18 విడుదల కాబోతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతికి ఇవాళ జరిగిన ఈవెంట్, ట్రైలర్ కంటెంట్ తో సరిపడా హైప్ వచ్చేసింది. ఇక వచ్చేవారం సక్సెస్ కొట్టి దాన్ని నిలబెట్టుకోవడమే తరువాయి.